ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ లో ఓ మంత్రి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీనియర్ మంత్రిగా జగన్ కు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా ముద్రపడిన ఆయన వ్యవహారశైలిపై ఇప్పుడు వైసీపీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. పార్టీ కోసం, జగన్ కోసం ఎంత వరకు అయినా వెళ్లేందుకు సిద్ధంగా ఉండే చిత్తూరు జిల్లా పుంగనూరు శాసనసభ్యుడు, ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీలో ఉన్న ప్రాధాన్యత గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఆయన జగన్ తర్వాత విజయ్ సాయి రెడ్డి ఏ విధంగా అయితే చక్రం తిప్పుతున్నారో అదేవిధంగా ఏపీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా నడుస్తోంది. మొదటి నుంచి జగన్ కు అన్నిరకాలుగా అండగా ఉంటూ రామచంద్రారెడ్డి జగన్ కు సన్నిహితుడిగా ముద్ర వేయించుకున్నారు.
ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కూడా ఢిల్లీలో వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. అయితే ఇక్కడ మంత్రి రామచంద్ర రెడ్డి వివాదాస్పదం అవ్వడానికి కారణం కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కొన్ని కొన్ని విషయాలు చూసి చూడనట్టుగా వ్యవహరించామని మంత్రికి సిపార్సులు చేస్తున్నా వాటిని పట్టించుకోకుండా నిర్మొహమాటంగా మాట్లాడుతుండటంతో కొంతమంది నొచ్చుకుంటున్నారట. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన పనుల తాలుకా బిల్లులు చెల్లింపులు జరగకపోవడంతో వాటిని మంజూరు చేయాల్సిందిగా ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేలు సిపార్సులు చేస్తున్నారు. పెద్దిరెడ్డి మాత్రం వాటిని పక్కన పెట్టేస్తున్నారు.
జగన్ క్యాబినెట్ లో అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పనిచేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి ఓటు బ్యాంకు తీసుకువచ్చే శాఖ కావడంతో పెద్దిరెడ్డి చాలా నిర్మొహమాటంగా నిక్కచ్చిగా పనిచేస్తునాన్రట. జగన్ తప్ప ఎవరు ఏమి చెప్పినా పట్టించుకోకుండా తనదైన స్టైల్లో రామచంద్రారెడ్డి ముందుకు వెళుతున్నాడు. ఇదే పార్టీ నేతలు కొంతమందికి అసహనం కలిగిస్తోంది.
నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయడంలోనూ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇదే విధంగా వ్యవహరించడంపై వైసీపీ ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు గుర్రుగా ఉన్నారు. అయితే ఈ విషయాన్ని జగన్ వరకు తీసుకువెళ్లినా ఆయన పట్టించుకునే అవకాశం ఉండదని సైలెంట్ గా ఉండిపోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే వైసీపీ లో హాట్ టాపిక్ గా మారింది. రామచంద్రారెడ్డి ఉద్దేశించి ఆయన సీతయ్య ఎవరి మాటా వినడు అంటూ జోకులు వేసుకుంటున్నారు.