-పాకిస్తాన్ హెచ్చరిక
ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్ము కశ్మీర్లోని నౌషెరాకు సమీపంలో ఉన్న శిబిరాలపై భారత ఆర్మీ దాడులు నిర్వహించిన నేపథ్యంలో తమ సైనికులు కూడా భారత్ కు బదులు ఇవ్వాలని భావిస్తున్నట్లు, యుద్ధ విమానాలతో సియాచిన్ ప్రాంతంలో చక్కర్లు కొట్టారని పాకిస్థాన్ పత్రికలు పేర్కొన్న విషయం తెలిసిందే. అలాగే పాక్ వైమానిక దళానికి చెందిన అన్ని ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్లను కార్యకలాపాలకు సిద్ధంగా ఉంచినట్లు తమ దేశ ఎయిర్ చీఫ్ మార్షల్ సొహైల్ ధ్రువీకరించారని పాక్ మీడియా పేర్కొంది. భారతదేశం ఒకవేళ దాడి చేస్తే భారతీయులు తరతరాల పాటు గుర్తుంచుకునేలా తాము దెబ్బతీస్తామని సొహైల్ చెప్పినట్లు జియో టీవీ ఓ కథనం ప్రసారం చేసింది. ఈ విషయంపైనే సోహైల్ పైలట్లు, టెక్నికల్ స్టాఫ్తో మాట్లాడారని, ఆయన స్వయంగా మిరేజ్ జెట్ను కూడా నడిపారని తెలిపింది.
భారత్తో యుద్ధానికి సన్నాహాల్లో భాగంగానే పాక్ ఈ చర్యలకు పాల్పడుతోందా?
నియంత్రణ రేఖ వద్ద తరుచూ కాల్పులకు తెగబడుతూ భారత్ను రెచ్చగొడుతున్న పాకిస్థాన్కు ఇటీవలే భారత్ గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. భారత సైన్యం చేసిన దాడులతో పాక్ పలు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. భారత్-పాక్ సరిహద్దులోని సియాచిన్ గగనతలంలో తమ వైమానిక దళం కసరత్తు నిర్వహించినట్లు పాకిస్థాన్ మీడియా ప్రచురించిన కథనం కలకలం రేపుతోంది. భారత్ నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో తమ దళాలు అప్రమత్తమయ్యాయంటూ పాక్ మీడియా పేర్కొంది. యుద్ధ సన్నాహకాల్లో భాగంగానే సరిహద్దు ప్రాంతాల్లోని ఎయిర్ బేస్ను పాక్ వాయుసేన అధిపతి సోహైల్ అమన్ సందర్శించినట్లు భావిస్తున్నారు. సియాచిన్ మీదుగా మిరేజ్ యుద్ధ విమానాలు సోహైల్ అమన్ సమక్షంలోనే ఎగురుతున్నాయని భావిస్తున్నారు. పాక్ పత్రికలు చేసిన కథనాలను భారత అధికారులు మాత్రం కొట్టిపారేస్తున్నారు.