ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉల్లి కోసం జనాల ప్రాణాలు తీస్తారా: లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 05, 2019, 07:46 PM

సీఎం జగన్‌పై మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. పెరుగుతున్న ఉల్లి ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదంటూ ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో ఇసుక కోసం ధర్నాలు, ఉల్లి కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని విమర్శలు గుప్పించారు. కేజీ ఉల్లిపాయల కోసం ప్రజల ప్రాణాలు తీసే వరకు వచ్చిందంటూ.. విజయనగరంలో జరిగిన తొక్కిసలాట వీడియోను లోకేష్ షేర్ చేశారు.


''జగన్ పాలనలో ప్రజలు ఇసుక కోసం ధర్నాలు, ఉల్లి కోసం ఉద్యమాలు చెయ్యాల్సిన దుస్థితి వచ్చింది. కేజీ ఉల్లిపాయల కోసం కూడా, ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు గారి పరిపాలనలో, ఉల్లి ధరలు పెరిగితే, రేషన్ షాపులు ద్వారా సబ్సిడీ ఉల్లిపాయలు సరఫరా చేసి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసారు. 30 మంది సలహాదారులను పెట్టుకుని కూడా, ప్రజలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు.'' అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.


కాగా, ఉల్లి కోసం విజయనగరం జిల్లా పార్వతీపురంలో తొక్కిసలాట జరిగింది. ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఉల్లి సబ్సిడీ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మార్కెట్లో రూ.100 పలుకుతున్న ఉల్లిని ఏపీ ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.25కే అందిస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఉల్లిని కొనేందుకు రిటైల్ కేంద్రానికి స్థానికులు భారీగా తరలివచ్చారు. లోపలి నుంచి నిర్వాహకులు గేట్లు తీయడంతో జనమంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో తోపులాటలో పలువురు కిందపడిపోయారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com