- అన్ని పనులను పూర్తి చేద్దాం
- నియోజకవర్గ సమీక్షలో జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : మైలవరం నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని అన్ని గ్రామాలలో నూటికి నూరు శాతం పనులను పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఆ ప్రణాళికల అమలుకు అవసరమైన అన్ని నిధులు తప్పక తీసుకువస్తానని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేసారు. ఆయన మైలవరంలో నియోజకవర్గ స్థాయి అన్ని శాఖల అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన రహదారులు, త్రాగునీరు, ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, విద్యుత్, పింఛన్లు, అంగన్ వాడీ భవనాలు, పాఠశాల భవనాలకు అదనపు గదులు, పూర్తి స్థాయి మరుగుదొడ్లు వంటి అన్ని పనులను స్పష్టమైన ప్రణాళికలతో పూర్తి చేస్తూ, గ్రామాలను స్మార్ట్ విలేజస్’ గా రూపొందించాలని ఆదేశాంచారు. మైలవరం నియోజకవర్గంలో 444 సిసి రోడ్లకు గాను 226కి.మీ రోడ్లు పూర్తి చేసామని మిగలిన రోడ్లను పూర్తి చేయాల్సి ఉందన్నారు. నియోజకవర్గంలో 115 బెల్ట్ షాపులను గుర్తించగా, వీటిలో 62 షాపులు ఎత్తివేసారని మిగిలినవి కూడా నిలుపుదల చేసేందుకు ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో సారా కేసులు పూర్తిగా లేకుండా చేయటం సంతోషించదగ్గ విషయంగా చెప్పారు. వరల్డ్ బ్యాంక్ సాయంతో నియోజకవర్గంలోని అన్ని సబ్ స్టేషన్ల నిర్మాణం ద్వారా విద్యుత్ సమస్యలను అదిగమించి 24గంటలు విద్యుత్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 173 సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేసినట్లు, ఓడిఎఫ్ క్రింద కేవలం 20 గ్రామాలు మాత్రమే మిగిలాయని సంబంధిత శాఖ అధికారులు మంత్రి ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. నియోజకవర్గంలో 171 అంగన్ వాడీ పాఠశాలలకు గాను 116 సొంత భవనాలు నిర్మించినట్లు ఐసిడిఎస్ అధికారులు తెలిపారు. మిగిలిన వాటి నిర్మాణాలకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 1280 ఎన్టీఆర్ గృహాలు, 983 పిఎంఏవై గృహాలు పూర్తి చేయాల్సిందేనని మంత్రి ఆదేశించారు. రైతుల సంబంధించిన సాగునీటి అవసరాలపై ఉమా ఆరా తీసారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి జలాలతో ఎకరాకు 42 బస్తాలు పండించినట్లు కొందరు రైతులు తెలిపారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆచరణలోకి వస్తే పశ్చిమ కృష్ణా జిల్లాలో మెట్ట రైతుల సాగునీటి సమస్యలకు శాశ్విత పరిష్కారం దొరికినట్లేనని మంత్రి ఉమా ఉద్ఘాటించారు. రైతులు భూసార పరీక్షలు, వర్మీ కంపోస్ట్ వాడకం వంటి విధానాలపట్ల ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు.
ఇక నెల నెలా సమీక్ష...
మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై రానున్న రోజుల్లో నెలల వారీగా సమీక్షలు నెల నెలా సమీక్షాసమావేశాలు నిర్వహించాలని, ఈ సమీక్షలకు తానే స్వయంగా వస్తానని మంత్రి ఉమా తెలిపారు. అన్ని శాఖలు తమ ప్రణాళికలను రెండు మూడు రోజుల్లో సిద్ధం చేయాలని మరుసటి సమావేశానికి మరింత ప్రగతిని సాధించాలని మంత్రి ఉమా తెలిపారు.
మైలవరంలోనే బస...
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారుల సమీక్షా సమావేశం అనంతరం రాత్రి మైలవరంలోని కార్యాలయంలో నిద్ర చేసారు. అంతకు ముందు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా సమీక్ష నిర్వహించారు. సాక్షాత్తూ మంత్రి గారే నియోజకవర్గంలో నిద్రించటంతో పోలీస్ శాఖ వారు తగిన రక్షణ చర్యలు చేపట్టారు. అధికారులు, నాయకులు, ఆయా సమస్యలపై మంత్రితో కూలంకుషంగా చర్చించారు.
చంద్రన్న భీమా 18 లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ...
చంద్రన్న భీమా పథకం క్రింద నియోజకవర్గంలో 18మంది లబ్ధిదారులకు రూ.6,75,000లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అందజేసారు. ఆయన మైలవరం కార్యాలయంలో బసచేసారు. ఈ సందర్భంగా నియజకవర్గంలో ఇబ్రహీంపట్నం దాములూరు నక్కా అంకయ్యకు రూ.30వేలు, ఇబ్రహీంపట్నం టౌన్ కొక్కిలిగడ్డ ఈసుబుకు రూ. 75వేలు, వేముల రోశయ్యకు రూ.30వేలు, ఆరుద్ర తిరుపతిరావుకు రూ.30వేలు, షేక్ అల్లాబక్షుకు రూ.30వేలు, బాదం వెంకటేశ్వర్లుకు రూ. 30వేలు, కొండపల్లి గ్రామానికి చెందిన పల్లపు కనకమ్మకు రూ.30వేలు, చిలకలపూడి శ్రీనివాసరావుకు రూ.30వేలు, కేతనకొండ గ్రామానికి చెందిన పదర్తి విజయ్ కుమారికు రూ.30వేలు, మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన కొర్లపాటి సుధారాణికి రూ.75వేలు, మైలవరం టౌన్ పెరుమాళ్ళ వీరయ్యకు రూ.30వేలు, కొండేటి వేణుకు రూ.75వేలు, పొందుగల గ్రామానికి చెందిన పసుపులేటి ఉషారాణికి రూ.30వేలు, జి.కొండూరు మండలం జి.కొండూరు గ్రామానికి చెందిన చందా ధర్మయ్యకు రూ.30వేలు, తిరుమరకొండ అయ్యప్పకురూ. 30వేలు, చెన్నూరి భధ్రయ్యకు రూ.75వలు, వెల్లటూరు మేడి వెంకటరమణకురూ.30వేలు, కుంటముక్కల మెట్టపల్లి నాగరాజుకు రూ.30వేలు మంత్రి ఉమా అందజేసారు.