రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక కొరత ఏర్పడటానికి గత పదేళ్లలో ఎపుడూ లేనంతగా వర్షాలు కురియడం వరదలు రావడంతో ఇసుక తవ్వకాలు ఆగిపోయాయని, ఇది తెలిసి కూడా తెలుగుదేశం పార్టీ ఇసుక రాజకీయం చేస్తున్నదని పంచాయతీరాజ్,గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మండి పడ్డారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో మీడియాలో మాట్లాడుతూ. గత డెబ్బై రోజులుగా కృష్ణానదిలో, నలబై రోజులుగా గోదావరిలో వరద కొనసాగుతోందని, ప్రతికూల పరిస్థితి వల్ల రీచ్ ల నుంచి ఇసుకను తీయలేకపోతున్నామన్నారు. ఇసుక రీచ్ ల నుంచి వరదనీరు తగ్గగానే కావాల్సినంత ఇసుకను వినియోగదారులకు అందచేస్తామని వెల్లడించారు. ఇసుక కొరత వల్ల నిర్మాణ పనులు మందగించకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని వివరించారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలుగుదేశం ప్రభుత్వం మీద నూరు కోట్ల రుపాయల ఫైన్ ఎందుకు విధించిందో ఆ పార్టీ నేతలొకసారి ప్రజలకు వివరించాలని పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి సలహా ఇచ్చారు.ఈ ఫైన్ గత అయిదేండ్లలో రాష్ట్రంలో పెరిగిన ఇసుక మాఫియాకు సాక్ష్యమని ఆయన అన్నారు.ఇాలాంటి విధానం ఇపుడు రద్దయినందున తెలుగుదేశం నాయకులు కంగారుపడుతున్నారని, అందుకే వరదలొచ్చిన విషయం కూడా విస్మరించి ఇసుక లేదని గోల చేస్తున్నారని ఆయన విమర్శించారు.