వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి వచ్చిన ఓ ఎంపీకి పెనుప్రమాదం తప్పింది. కేంద్ర మాజీ మంత్రి, పాటలీపుత్ర ఎంపీ రామ్ కృపాల్ యాదవ్ తన నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్యూబ్ల బోటులో ప్రయాణిస్తున్న ఆయన.. అదుపు తప్పి నదిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఎంపీని రక్షించారు. వివరాల్లోకి వెళితే.. వరదలతో అతలాకుతలమైన ధనురువా గ్రామ పరిశీలనకు ఎంపీ కృపాల్ యాదవ్ బుధవారం రాత్రి వెళ్లారు. నదికి అవతలి గట్టున్న ప్రాంతాన్ని పరిశీలించాలనుకున్న ఆయన.. సమయానికి పడవ అందుబాటులో లేకపోవడంతో.. గ్రామస్థులు ఉపయోగించే టైర్ల ట్యూబ్లతో తయారు చేసిన పడవలో బయలుదేరారు. ఆయనతో పాటు మరికొంతమంది అది ఎక్కారు. దీంతో అదుపుతప్పి నీటిలో పడిపోయారు. వెంటనే స్థానికులు అలర్ట్ అయ్యి.. ఆయన్ను సురక్షితంగా వెలికి తీశారు. తమ దగ్గరున్న తువాళ్లతో తడిబట్టలతో ఉన్న ఆయనకు సపర్యలు చేశారు.
ప్రమాదం నుంచి బటయపడ్డ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైందని.. గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇక్కడి ప్రాంతాల్లో పర్యటించడానికి తనకు కనీసం పడవ కూడా దొరకలేదని.. ట్యూబులతో తయారుచేసిన పడవను ఉపయోగించాల్సి వచ్చిందన్నారు.