తెలుగుదేశం, జనసేన శ్రేణుల మధ్య విజయవాడలో ఈరోజు ఘర్షణ చోటుచేసుకుంది. విజయవాడలోని బెంజ్ సర్కిల్ జ్యోతిమహల్ కూడలి వద్ద అండర్ పాస్ నిర్మాణంపై టీడీపీ నేతలతో జనసేన శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. గతంలో జ్యోతిమహల్ కూడలి వద్ద అండర్ పాస్ నిర్మిస్తే ప్రమాదాలు జరుగుతాయని అధికారులు చెప్పారని జనసేన నేతలు తెలిపారు. అయితే ఇప్పుడు అండర్ పాస్ నిర్మాణానికి అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా అండర్ పాస్ వద్దకు చేరుకున్న టీడీపీ నేతలు కేశినేని నాని, గద్దె రామ్మోహన్, అశోక్ బాబులను జనసేన శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా, పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం లోక్ సభ సభ్యుడు కేశినేని నాని, గద్దె రామ్మోహన్, అశోక్ బాబులు అండర్ పాస్ ప్రాంతాన్ని సందర్శించారు.