అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్లోని 10 జిల్లాల్లో నూరు శాతం లక్ష్యాన్ని సాధించామని ఏపీ గనులశాఖ మంత్రి సుజయ వెంకట కృష్ణ రంగారావు చెప్పారు. రెండంకెల వృద్ధి రేటు సాధనకు సమన్వయంతో పనిచేద్దామని అధికారులకు సూచించారు. ఈ ఏడాది గనులశాఖ ఆదా య లక్ష్యం రూ. 1960 కోట్లు వచ్చాయని, గత ఏడాది లక్ష్యాన్ని మించి రూ. 1700 కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన తెలిపా రు. లక్ష్యాలను సమర్థవంతంగా చేరుకునే విధంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆయన అధికారులను మంత్రి ఆదేశించారు. స్థానిక ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర ఉన్నతాధికారులతో, కృష్ణా జిల్లా అధికారులతో మంత్రి సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2016-17 సంవత్సరంలో గనుల శాఖ ద్వారా రూ.1700కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుని నూరు శాతం లక్ష్యాన్ని అధిగమించగలిగామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 10 జిల్లాల అధికారులు నూటికి నూరు శాతం లక్ష్యాలను సాధించగలిగారని, కృష్ణా జిల్లా కూడా నూరు శాతం లక్ష్యాలను అధిగమించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర రాజధాని ప్రాంతంలో గనులు, భూగర్భ శాఖ అధికారులు మరింత నిబద్ధత, పారదర్శకతతో కూడిన పనితీరును చూపాల్సి ఉందన్నారు. సిబ్బంది విధి నిర్వహణలో లక్ష్యాలను సాధించేందుకు అంకితభావంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాలైన రెండెంకెల ప్రగతి దిశలో భాగంగా ఖనిజాధార పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలన్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయ వనరులను పెంపొందించడంలో భాగస్వాములు కావాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. శాఖ పనితీరు, విలువలు ఇనుమడించేలా సమన్వయంతో ముందుకు వెళదామని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ ఎండీసీ కార్యదర్శి, డైరెక్టర్ బి. శ్రీధర్, వీస్ అండ్ ఎండీ సీహెచ్ వెంకయ్య చౌదరి, ఏడీ మైన్స్ సుబ్రమణ్యం, కృష్ణా జిల్లా మైనింగ్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.