ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాబ్లీ ప్రాజెక్టు కేసులో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వెనుక భారతీయ జనతా పార్టీ కుట్ర ఉందని ఆరోపించారు ఏపీ మంత్రి పరిటాల సునీత... అనంతపురంలో పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించిన ఆమె... అనంతరం మాట్లాడుతూ... మహారాష్ట్ర ప్రభుత్వం నుండి చంద్రబాబుకు వచ్చిన అరెస్ట్ వారెంట్ వెనుక బీజేపీ కుట్ర ఉందన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు బాబ్లీ కేసుపై నోటీసులు ఇవ్వకుండా... నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడం రాజకీయ కక్షసాధింపేనని మండిపడ్డా ఆమె... రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేక ప్రధాని నరేంద్ర మోడీ ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేసును వాపస్ తీసుకోవాలి, లేదంటే తెలుగు ప్రజల ఆగ్రహం చూడక తప్పదని హెచ్చరించారు పరిటాల సునీత.