ఇంటర్నెట్డెస్క్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై ధ్వజమెత్తారు. మోదీ గంగా నదిపై ప్రమాణాలు చేయడమే కాకుండా ముందు ఓటేస్తే తర్వాత పనిచేస్తానంటూ బేరాలు కూడా కుదుర్చుకుంటారని ఆరోపించారు. మోదీ నియోజకవర్గమైన వారణాశిలో రాహుల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగించారు. ‘మోదీ తనను ప్రధానిని చేస్తే ఆ తర్వాత గంగా నది ప్రక్షాళన కార్యక్రమం చేపడతానని ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తాను గంగమ్మ తల్లి బిడ్డనని, ఆమే వారణాశికి ఆహ్వానించిందని మోదీ చెప్పారు. అంటే గంగమ్మతల్లికి గుజరాత్కి చెందిన ఒక్కడే కుమారుడు ఉన్నాడా? గంగా నది మనందరిదీ కాదా’ అని రాహుల్ ప్రశ్నించారు.
ఉత్తర్ప్రదేశ్లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పాటుచేస్తే యువతకు రూ.20లక్షలు చొప్పున ఇచ్చి వ్యాపారం చేసుకునేందుకు సాయం చేస్తామని రాహుల్ చెప్పారు. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి వారణాశిని క్యోటో నగరంగా తీర్చిదిద్దుతానని, ప్రతి ఇంటికీ శుభ్రమైన తాగునీరు కల్పిస్తామని, భోజ్పురి ఫిలిం నగరాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు కానీ ప్రధాని అయిన మూడేళ్ల కాలంలో ఆయన ఏ ఒక్క మాటా నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఉత్తర్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని, ఎన్నికలయ్యాక కూడా తమ పొత్తు కొనసాగుతుందని రాహుల్ పేర్కొన్నారు.