ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిల్లీలో దీక్ష చేయాలని ప్రత్యేక హోదా సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్కు భాజపా చేసిన మోసాన్ని ఎండగడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో చేస్తున్న దీక్షలో చలసాని శ్రీనివాస్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్తో పాటు పక్క రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా పోరులో అన్ని పార్టీలు, సంఘాలను కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చంద్రబాబు ప్రయత్నం చేసినా కొన్ని పక్షాలు రావడం లేదని.. రెండు మెట్లు దిగైనా సరే అందరినీ కలుపుకొని పోరు సాగించాలన్నారు. దిల్లీలో తెదేపా, వైకాపా ఎంపీలు బాగానే పోరాడారని.. అయితే మనలో ఐక్యమత్యం లేనందువల్ల ఇతరుల వద్ద చులకన అయిపోతున్నామన్నారు.