కథువాలోని ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ చిన్నారి బొమ్మగీసినందుకుగానూ కేరళకు చెందిన ఓ చిత్రకారిణి ఇంటిపై కొందరు దాడి చేశారు.పాలక్కాడ్కు చెందిన దుర్గా మాలతీ అనే చిత్రకారిణి ఇంటిపై గురువారం అర్థరాత్రి దాటాక కొందరు దాడి చేశారు. ఈమేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దుర్గ మాట్లాడుతూ... ‘గురువారం అర్ధరాత్రి దాటాక మా ఇంటిపై కొందరు వ్యక్తులు రాళ్లు విసిరారు. అనంతరం ‘మీరు గీసిన చిన్నారి బొమ్మ మా మనోభావాలు దెబ్బతీసింది’ అంటూ నినాదాలు చేస్తూ మా ఇంటి కిటికీలు కూడా పగలగొట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు. ఇకపై చిన్నారి బొమ్మలు గీసినా, ఆమె తాలూకు పెయింటింగ్స్ వేసినా వదిలిపెట్టబోమని హెచ్చరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.’ అని తెలిపారు.
దీనిపై పాలక్కడ్ పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి మాట్లాడుతూ...‘ దాడికి పాల్పడిన కొందరు వ్యక్తుల్ని గుర్తించి వారిపై కేసు నమోదు చేశాం.’ అని తెలిపారు. కథువా ఘటనను ఉద్దేశిస్తూ గీసిన బొమ్మను దుర్గ మాలతి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో కొందరు వ్యక్తులు ఆమె ఇంటిపై దాడికి దిగారు.
జమ్మకశ్మీర్లోని కథువాకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిని దండగులు అపహరించి అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.