రాజకీయాల కోసమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీకి వచ్చారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, అమరావతి అంటే అవినీతి అని వినిపిస్తోందని అన్నారు. టీడీపీ పరపతి దేశ రాజకీయాల్లో క్షీణించిందని ఆయన తెలిపారు. రాజధాని భ్రమలను బాబు ఢిల్లీ మోసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు వాదనల్లో వాస్తవం, చిత్తశుద్ధి, విశ్వసనీయత లేవని ఆయన స్పష్టం చేశారు. దేశమంతా తిరిగినా చంద్రబాబుకు మద్దతు దొరకదని ఆయన పేర్కొన్నారు. చిన్నాచితక నేతలను కలిసి, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామని అనుకుంటే అది వారి భ్రమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు.