సోమవారం పంజాబ్లో జరగాల్సిన 10వ, 12వ తరగతి పరీక్షల్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సిబిఎస్ఇ) వాయిదా వేసింది. ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ పలు దళిత సంఘాలు సోమవారం భారత్ బంద్కు పిలుపు ఇవ్వడంతో ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. బంద్ కారణంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశమున్నందున పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు పంజాబ్ పాఠశాల విద్య డైరెక్టర్ జనరల్ నుండి సిబిఎస్ఇకి ఆదివారం లేఖ అందింది. దీంతో పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు సిబిఎస్ఇ ప్రకటించింది. పంజాబ్ ప్రభుత్వం కూడా అన్ని పాఠశాలలకూ సెలవుల్ని ప్రకటించింది. చండీగఢ్లో మాత్రం యథావిధిగా పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. తదుపరి పరీక్ష తేదీలను త్వరలోనే బోర్డు ప్రకటించనుంది.