ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్ క్రిస్ లిన్ సంచలన ప్రకటన చేశాడు. ఐపీఎల్ ఆటగాళ్లకు వచ్చే వారమే కరోనా వ్యాక్సిన్లు ఇవ్వనున్నారని అతడు చెప్పాడు. మంగళవారం ఓ ఆస్ట్రేలియా వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లిన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్ లో ఆడుతున్న క్రికెటర్లందరికీ కరోనా వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు లిన్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఐపీఎల్ లో ఆడే విదేశీ ఆటగాళ్లకు కూడా బీసీసీఐ వ్యాక్సిన్లు ఇస్తుందా అన్న సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
మే 1 నుంచి దేశంలో18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రిజిస్టర్ చేసుకుంటేనే వ్యాక్సిన్ ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు కరోనా కేసుల భయంతో ఇప్పటికే ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇంటికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో క్రిస్ లిన్ చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది.