ఏపీలో ఈ ఎన్నికల్లో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్ధి, ఏపీ వికాసమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రజల విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని మండిపడ్డారు. జగన్ పాలనలో పేదలు ఎవ్వరూ అభివృద్ధి కాలేదని, మాఫియా నేతలు మాత్రం అభివృద్ధి అయ్యారని విమర్శించారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని కలికిరిలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన నేత నాగబాబు, కూటమి నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డిపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు.