ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మోదీనగర్లోని ఓ కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. టిఒఐ కథనం మేరకు.. మోదీనగర్ తహసీల్ పరిధిలో ఉన్న కర్మాగారం కొవ్వొత్తులు తయారీకి సంబంధించినది. కర్మాగారంలో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలకు నిప్పు అంటుకోగా ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో కర్మాగారంలో 20 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. 12 ఫైరింజన్లతో మంటలు ఆర్పారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.జనావాసాల మధ్య ప్యాక్టరీని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించి, ఆ వెంటనే మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు ఫ్యాక్టరీ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు