తెలిసీతెలియని వయస్సులో అమ్మ తిట్టిందన్న కోపంలో ఆ బాలిక పారి పోయింది. ఆ బాలికను గమనించిన వ్యభిచార ముఠా అమ్మానాన్నల దగ్గరికి చేరుస్తామంటూ నమ్మబలికి తమ వెంట తీసుకెళ్లింది. ఓ గదిలో ఆ బాలికను బంధించి వ్యభిచారం చేయాలంటూ ఆ ముఠా ఒత్తిడి చేసింది. బలవంతంగా డ్రగ్స్ ఎక్కించి విటుల వద్దకు పంపించి నరకం చూపించింది. అనంతరం తప్పించుకున్న ఆ బాలిక రైల్వేస్టేషన్లో చైల్డ్ హెల్ప్లైన్ ప్రతినిధులను ఆశ్రయించడంతో ఈ దారుణం బయటకు వచ్చింది. ఈ దారుణ ఘటన పంజాబ్లోని లుధియానాలో జరిగింది.వివరాల ప్రకారం.. ఫజిల్కా జిల్లాకి చెందిన పద్నాలుగేళ్ల బాలిక అమ్మ తిట్టిందన్న కోపంతో ఇంటి నుంచి పారిపోయి రైల్లో లుధియానా రైల్వే స్టేషన్కి వెళ్లింది. అక్కడి నుంచి ఎక్కడికి పోవాలో తెలియకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఆ బాలిక వ్యభిచార ముఠాకు కనిపించింది. దీంతో ముఠాలోని ఓ మహిళ నిన్ను ఇంటికి పంపిస్తానని మాయమాటలు చెప్పి ఆ బాలికను ఇంటికి తీసుకెళ్లింది. తీరా ఇంటికెళ్లాక బాలికను గదిలో బంధించి బతికుండగానే నరకం చూపించారు. డ్రగ్స్ తీసుకోవాలంటూ ఆ బాలికపై ఒత్తిడి చేసి హింసించేవారు. నెలరోజులు గదిలోనే ఉంచి బలవంతంగా డ్రగ్స్ ఎక్కించి అలవాటు చేశారు. అనంతరం బలవంతంగా డ్రగ్స్ ఎక్కించి విటుల వద్దకు పంపి నరకం చూపించారు. బాలిక అక్కడి నుంచి బయటపడి చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధులను ఆశ్రయించడంతో ఈ దారుణం బయటకువచ్చింది.