'ఆదాయం పాతాళంలో, ధరలు ఆకాశంలో.. కరోనా భూమి మీద ఉన్న సమయంలో ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి పేద, సామాన్య ప్రజల నడ్డి విరుస్తోంది' అని టీడీపీ అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ విమర్శించారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 'నేను విన్నాను.. నేను ఉన్నానని ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన జగన్కు పెరిగిన రేట్ల గురించి వినిపించడం లేదా? ప్రజల సమస్యలు కనిపించడం లేదా?' అని ప్రశ్నించారు. కరోనా వల్ల ఉపాధి లేక.. తినడానికి తిండిలేక ప్రజలు అల్లాడుతున్న ఈ సమయంలో ధరలు పెంచుతారా? అని భగ్గుమన్నారు. ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతుంటే మంత్రులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇంట్లో ఉండి బూతులు ప్రాక్టీస్ చేస్తున్నారా? అంటూ విరుచుకుపడ్డారు. 20 రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు రూ.10 పెరిగాయని, రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో లీటర్ పెట్రోల్పై రూ. 30, లీటర్ డీజిల్పై రూ.25 ఆదాయం వస్తోందన్నారు. గతంలో పెట్రోల్ ధర రూ.75 ఉంటే చంద్రబాబు నాయుడు రూ.2 తగ్గించారని రామకృష్ణ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.