జమ్మూ కశ్మీర్లోని జదిబాల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆదివారం ఉదయం జదిబాల్, పోజ్వల్పోరా ప్రాంతాల్లో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎన్కౌంటర్ మొదలైంది. కనీసం ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు భావించిన అధికారులు టెర్రరిస్టుల తల్లిదండ్రులను ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశానికి తీసుకొచ్చారు. వారిని లొంగిపోమని చెప్పినా అందుకు ఒప్పుకోలేదని కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.ఈ ఘటనతో శ్రీనగర్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు తెలిసింది. కాగా మరణించిన వారిలో ఒకరు 2019 నుంచి టెర్రరిస్టు కార్యకలాపాల్లో యాక్టివ్గా ఉన్నారని అధికారులు తేల్చారు. మరొకరికి గత నెలలో బీఎస్ఎఫ్ సిబ్బందిపై జరిగిన దాడిలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఎన్కౌంటర్లో సీఆర్పీఎఫ్కు చెందిన ముగ్గురు సిబ్బందితో ఓ పోలీసు అధికారికి గాయాలయ్యాయి. శ్రీనగర్లో కేవలం ఒక నెల రోజుల తేడాతోనే రెండవ ఎన్కౌంటర్ జరిగింది. మే లో జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్కు చెందని ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపాయి.