దేశంలో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా 16వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 35 పైసలు పెరిగింది. డీజిల్ ధర కూడా 60 పైసలు పెరిగింది. హైదరాబాద్లో డీజిల్ ధర 58 పైసలు, పెట్రోల్పై 37 పైసలు పెరిగింది. గత కొన్ని రోజులుగా చమురు ధరలు స్థిరంగా ఉండడం లేదు. రోజుకోరకంగా పెరుగుతూ వస్తున్నాయి. కేంద్ర పెట్రోలియం, సహజవనరుల మంత్రిత్వ శాఖ ఈ ధరల పెంపుపై ఏవోవే కారణాలు చెబుతూ పెంచేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ముడిసరుకు మార్కెట్ ధరలు పెరుగుతున్నందున ఈ వ్యత్యాసం కనిపిస్తోందంటూ వివరణ ఇస్తోంది.
దాదాపు 16 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తప్ప ఒక్క మెట్టు కూడా కిందికి దిగిందిలేదు. లాక్ డౌన్ ప్రకటించకముందు లీటరు పెట్రోలు రూ.74.80 ఉంటే, డీజిల్ ధర రూ. 68.69గా ఉండేది. మార్చి 16 నుంచి ఏప్రిల్, మే నెలల్లో కూడా ఇదే ధర కొనసాగింది. అయితే జూన్ 7 నుంచి ధరల పెరుగుదల మొదలైంది. లాక్ డౌన్ తర్వాత వాహనాలన్నీ రోడ్డెక్కాయి. ఇదే సమయంలో పెట్రోల్ ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయి.