జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయల్దేరారు. ఇటీవలే ఏపీలో ఇసుక కొరతపై లాంగ్ మార్చ్ చేసి... రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్... ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తున్నారన్నది ఆ పార్టీ వర్గాలు చెబుతున్న మాట. బట్... అసలు విషయం వేరే ఉందన్నది రాజకీయ వర్గాల నుంచీ వస్తున్న టాక్. బ్రాడ్ మైండ్తో చూస్తే ఓ విషయం మనకు స్పష్టమవుతుంది. ఏంటంటే... వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాలేదు. ఇంతలోనే ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా విమర్శల దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన దూకుడుగా ఉన్నాయి. టీడీపీ గత వైభవం కోసం పోరాడుతుంటే... జనసేన వెనక ఢిల్లీ పెద్దల వ్యూహం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్... ప్రభుత్వ విధానాలపై ఓ రేంజ్లో ఫైర్ అవ్వడానికి బీజేపీ రాజకీయ వ్యూహం ఉందని సమాచారం.
ప్రస్తుతం ఏపీలో బీజేపీకి రాజకీయంగా అంత సీన్ లేదు. పోనీ టీడీపీతో జతకట్టే పరిస్థితి కమలదళానికి లేదు. ఇలాంటి సమయంలో... అగ్రనేతల కళ్లు పవన్ కళ్యాణ్పై పడినట్లు తెలిసింది. 2023 లేదా 2024 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ని కలుపుకొని... ఏపీలో శక్తిమంతమైన పార్టీగా లేదా కూటమిగా మారాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. జనసేన, బీజేపీ పొత్తుకి టీడీపీ బయట నుంచీ మద్దతు ఇచ్చేలా ఈ వ్యూహం ఉంటుందని తెలిసింది.
ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి బరిలోకి దిగితే వైసీపీపై పైచేయి సాధించొచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యూహాంలో భాగంగానే టీడీపీ, జనసేన ఒక్కటే అనే సంకేతాలు ఇప్పటి నుంచే ప్రజల్లోకి పంపేలా... టీడీపీ నేతలు పవన్తో కలవడం, పవన్ చేపట్టే కార్యక్రమాలకు టీడీపీ నేతలు వెళ్లడం వంటివి జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కూడా పవన్ పోరాటాలకు పరోక్ష మద్దతు ఇస్తోంది.
ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్... ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలిసి పవన్... రాష్ట్రంలో పరిస్థితులపై చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా ఆయన... బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీతో భేటీ అవుతారని తెలిసింది. ఇదంతా కమలం అగ్రనేతల వ్యూహంలో భాగమేనని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. అందువల్ల పవన్ పర్యటన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మరింత జోరందుకునే అవకాశాలున్నాయనుకోవచ్చు. ఇప్పటివరకూ అంత జోరుగా లేని బీజేపీ కూడా ఇకపై కన్నెర్ర జేయబోతోందని టాక్.