ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమల కేసులు విస్తృత ధర్మాసనానికి బదిలీ

national |  Suryaa Desk  | Published : Thu, Nov 14, 2019, 06:16 PM

కేరళలోని సుప్రసిద్ద శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని సమర్ధిస్తూ, వ్యతిరేకిస్తూ దాఖలైన 64 పిటిషన్లను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది. ఆలయ సాంప్రదాయాలు, నియమనిబందనల ప్రకారం రజస్వల అయిన బాలికల మొదలు ఋతుక్రమంలో ఉన్న మహిళలకు అయ్యప్పస్వామి ఆలయంలో ప్రవేశంపై దశాబ్ధాలుగా నిషేధం కొనసాగుతోంది. ఇంతవరకు మహిళా భక్తులు ఆ నియమానికి కట్టుబడి ఉంటున్నారు కనుక కేరళ హైకోర్టు కూడా ఆ నిషేధాన్ని సమర్ధిస్తూ 1991లో తీర్పు చెప్పింది.
అయితే ఈ నిబందన లింగ వివక్షతకు అద్దం పడుతోందని, మహిళల ప్రాధమిక హక్కులకు అది వ్యతిరేకంగా ఉందంటూ 2006లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్ 28న ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పు చెప్పింది. కానీ అప్పటి నుంచి ఆ తీర్పును సమర్ధిస్తూ, వ్యతిరేకిస్తూ ఆందోళనలు మొదలయ్యాయి. కోర్టులలో అనేక పిటిషన్లు కూడా దాఖలావుతూనే ఉన్నాయి.
ఆవిధంగా సుప్రీంకోర్టులో దాఖలైన 64 పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి రంజన్ గగోయ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరిపింది. అయితే ఆలయ మతాచారాలు, నిబందనలు, ప్రజల మత విశ్వాసాలతో కూడిన ఈ అంశంలో చట్ట ప్రకారం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చా లేదా? అనే దానిపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఈ కేసులన్నిటినీ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.
ఇప్పటి వరకు ఈ కేసులను విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనంలోని జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ జె. ఖన్వీల్కర్ సమర్ధించగా, జస్టిస్ నారీమన్, జస్టిస్ చంద్రచూడ్ మాత్రం వ్యతిరేకించారు. మెజార్టీ సభ్యులు సమర్ధించినందున ఈ కేసులను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com