ఎన్నికల ప్రచార సభలలో రేషన్ బియ్యం ఎందుకూ పనికిరానివి సరఫరా చేస్తున్నారని, తాము అధికారంలోకి రాగానే కార్డుదారులకు కిలో రూపాయి కి నాణ్యమైన బియ్యం ఇస్తామని ఊదరగొట్టి ఓట్లేయించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రభుత్వం, మంత్రులతో సహా అంతా ప్రచారం చేయటంతో సన్నబియ్యం సరఫరా అవుతుందని, రేషన్ కార్డు వినియోగదారులు భావించారు. ఈ క్రమంలోనే సన్నబియ్యం అందించే ప్రక్రియపై అధికార యంత్రాంగంతో కసరత్తులు కూడా చేయించారు. దీంతో ఇందుకోసం మరో రూ.వెయ్యి కోట్లు అదనపు భారం పడుతుందని నివేదించడంతో ప్రస్తుత పరిస్థితిలో ఇది అవసరం లేదంటూ దాంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు.
చివరకి ఇప్పుడిస్తున్న బియ్యం నాణ్యమైవేనంటూ పాలిష్ చేసి, నూకల పాలు తగ్గించి ఇస్తామని వివరించింది. అయితే బియ్యం సరఫరాకోసం ప్రభుత్వ లోగో ముఖ్యమంత్రి జగన్, వైఎస్ రాజశేఖర రెడ్డిల ఫోటోలతో ముద్ద్రించిన సంచులకు ఏకంగా రూ.750 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సంచులు తిరిగి ఉపయోగించుకోవడానికి కూడా పనికిరావని, వాటి వల్ల కాంట్రాక్టర్లు లాభపడటమే తప్ప తమకు ఒరిగేదేమీ ఉండదని వినియోగదారులు చెబుతున్నారు. వందల కోట్లు తిరిగి ఉపయోగపడని సంచుల కోసం వెచ్చించే ఆ నిధులు సన్నబియ్యానికే పెడితే సరిపోతుంది కదా అని కార్డుదారులు అభిప్రాయపడుతున్నారు.