అమెరికాలో కీ వెస్ట్కు చెందిన ఆండ్రూ ఫ్రాన్సిస్ ఆగర్భ శ్రీమంతుడు...తన విలాసాల కోసం ఏకంగా రూ.55 కోట్లు పెట్టి సముద్రం ఒక దీవిని కొనుగోలు చేశాడు. అయితేనేం చిలిపి పనులు మాత్రం మానుకోలేదు. ఒక సూపర్ మార్కెట్లో చీపుగా 300 డాలర్ల బిల్లు ఎగ్గొట్టి పారిపోతూ దొరకగా పోలీసులు అదుపులో తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... ఏప్రిల్ 5న స్థానికంగా ఉన్న కె మార్ట్ మాల్కు వెళ్లిన ఆండ్రూ ఫ్రాన్సిస్ ఒక కాఫీ మేకర్, ఎల్ఈడీ బల్బులు, కొన్ని ఖాళీ బాక్సులు కొనుగోలు చేశాడు. అయితే షాపింగ్ లో భాగంగా కొనుగోలు చేసిన ఖాళీ బాక్సుల్లో ఆండ్రూస్ చేతికందిన సామాన్లతో నింపేసి, ఎంచక్కా ఖాళీ బాక్సులకు మాత్రమే బిల్లు కట్టేసి బయటకు వెళ్లిపోయాడు. అయితే స్టోర్ మూసే సమయంలో కొన్ని వస్తువులు మిస్ అయ్యాయని గుర్తించిన సిబ్బంది.. సీసీ కెమెరా ఫుటేజీని చెక్ చేశారు. ఇంకేముంది ఫ్రాన్సిస్ చేసిన చిలిపి పనులు బయటపడ్డాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగ, అతని కారు నెంబర్ ద్వారా ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే తాము అరెస్టు చేసిన ఆండ్రూ ఫ్రాన్సిస్ బ్యాక్ గ్రౌండ్ తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఫ్లోరిడా తీర ప్రాంతానికి దగ్గరలో థాంప్సన్ ద్వీపానికి ఆండ్రూ ఫ్రాన్సిస్ ఓనర్ అని తెలిసి నోరెళ్లబెట్టారు. థాంప్సన్ ద్వీపంలోని రియల్ వరల్డ్ పేరిట ఒక పెద్ద రిసార్ట్ నిర్మించగా అందులో ఎంటీవీ వారు 2006లో ఒక రియాలిటీ షో సైతం నిర్వహించారు. అయితే ప్రస్తుతం తనపై వచ్చిన దొంగతనం ఆరోపణలపై మాత్రం ఆండ్రూ ఫ్రాన్సిస్ విచిత్రమైన సమాధానాలు చెబుతున్నాడు. కె మార్ట్ షాపింగ్ మాల్ లో ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని అందుకే అలా చేశానని తెలిపడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతు అయ్యింది.