ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలే అగ్రస్థానంలో నిలిచారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఈరోజు అమరావతిలో విడుదల చేశారు. రెండు సంవత్సరాలకు కలిపి 10 లక్షల 17 వేల 600 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. కాగా 81 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానం సాధించింది. అంతేకాదు ప్రభుత్వ కళాశాల్లో చదువుతున్న 67 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి కార్పొరేట్ కళాశాలలకు తామేమీ తక్కువ కాదని నిరూపించారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 9,340 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్ సాధించడం విశేషం. ఇక, మొదటి సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థుల్లో 60 శాతం మంది పాసయ్యారు. కాగా, మే 14వ తేదీన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించనున్నట్లు కార్యదర్శి ఉదయలక్ష్మి ప్రకటించారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదలచేయడం గమనార్హం. మొదటిసారిగా ఫలితాలను గ్రేడింగ్ విధానంలో విడుదల చేశారు. అదేవిధంగా ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్తోపాటు ఇతర వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉంచారు.