న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిని ప్రధాని మోదీ ఖండించారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు మోదీ సంతాపం ప్రకటించారు. నిన్న ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లలో 40 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారత్లో అస్థిరత్వం సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సాగవు. పుల్వామా ఉగ్రదాడికి 130 కోట్ల భారతీయులు ధీటైన సమాధానం ఇస్తారు. ఉగ్రదాడిని ఖండించిన దేశాలకు కృతజ్ఞతలు. విజయం సాధించేందుకు తాము పోరాడుతున్నాం. ఈ ఉగ్రదాడి వెనుక ఉన్నవారు తప్పక శిక్ష అనుభవిస్తారు. భద్రతాబలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. వారి ధైర్యసాహసాలపై నాకు పూర్తి నమ్మకముంది. దేశ రక్షణ, దేశ అభివృద్ధి కోసం ప్రాణాలర్పించిన వారికి నివాళులు. అమరుల సేవలను జీవితంలో ప్రతి క్షణం గుర్తుంచుకుంటా. వీర సైనికుల త్యాగాలను ఏ మాత్రం వృథాగా పోనివ్వం అని మోదీ పేర్కొన్నారు.