ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలా తయారయ్యారేంట్రా.. చివరికి ఎస్‌బీఐ బ్యాంకును కూడా వదల్లేదు, అసలేం చేశారంటే?

national |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 09:47 PM

సాధారణంగా మన దగ్గర ఉన్న డబ్బు, బంగారం, ఇతర పత్రాలు సురక్షితంగా ఉండాలని వాటిని బ్యాంకుల్లో దాచిపెడుతూ ఉంటాం. మన ఇంట్లో దొంగలు పడ్డా, ఏదైనా అనుకోని సంఘటన జరిగినా అవి సేఫ్‌గా ఉండాలని చూస్తాం. అయితే అలాంటి బ్యాంకు పేరుతోనే జనాల నుంచి వసూళ్ల పర్వం చేపట్టారు కొందరు దుండగులు. ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతోనే ఓ నకిలీ బ్యాంకును తెరిచి.. ప్రజల నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లు తీసుకోవడం ప్రారంభించారు. అయితే కొందరికి అనుమానం వచ్చి.. ఎస్‌బీఐ ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి తనిఖీలు చేపట్టి అది నిజమైన ఎస్‌బీఐ బ్యాంకు కాదని తేల్చారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.


ఛత్తీస్‌గఢ్‌లో ఓ భారీ ఘరానా మోసం బయటికి వచ్చింది. సక్తి జిల్లాలో కొందరు కేటుగాళ్లు ఏకంగా నకిలీ ఎస్‌బీఐ బ్రాంచ్‌ను తెరిచారు. ముల్ఖారౌదా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛంపోరా గ్రామంలో సెప్టెంబర్ 18వ తేదీన ఎస్‌బీఐ కొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు షాప్‌ను అద్దెకు తీసుకుని అందులో ప్రారంభించారు. కంప్యూటర్లు, ఫర్నీచర్, ఇతర బ్యాంకింగ్ సామగ్రితో ఎవరికీ అనుమానం రాకుండా ఓ నకిలీ బ్యాంకును మొదలుపెట్టి అందులో స్థానికుల నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లు సేకరించడం ప్రారంభించారు.


అయితే ఆ నకిలీ బ్యాంకు గురించి అనుమానం వచ్చిన స్థానికులు.. కొర్బా పట్టణంలోని ఎస్‌బీఐ రీజినల్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌బీఐ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఆ బ్రాంచ్‌లో తనిఖీలు నిర్వహించగా.. అది నకిలీది అని తేలింది. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి ముగ్గుర్ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఆ బ్యాంకులో మొత్తం ఐదుగురు పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఆ బ్రాంచ్ మేనేజర్‌గా చెప్పుకునే వ్యక్తి ఇంటర్వ్యూలు పెట్టి.. మిగిలిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని.. అయితే వారికి కూడా అది నకిలీ బ్రాంచ్ అని తెలియదని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.


అనంతరం ఆ నకిలీ ఎస్‌బీఐ బ్యాంకులో కంప్యూటర్లు, ఇతర సామాగ్రి, పేపర్లు సహా అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నకిలీ బ్రాంచ్‌ కారణంగా ఎవరైనా మోసపోయారా.. అసలు ఎంత మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశారు. ఎంత డబ్బు పోగేశారు. ఇతర లావాదేవీలు ఏమైనా జరిగాయా అనే వివరాలను పోలీసులు, బ్యాంక్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని ఆ గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com