లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్లను అంతమొదించడమే తమ లక్ష్యమని భీష్మ ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయేల్.. దాడులను తీవ్రతరం చేసింది. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చిన రెండు రోజుల తర్వాత లెబనాన్ రాజధాని బీరుట్ నగరంపై మరోసారి బాంబులతో విరుచుకుపడింది. ఆదివారం నుంచి ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ ముప్పేట దాడిచేస్తోంది. హెజ్బొల్లా లక్ష్యంగా జరిపిన ఈ దాడుల్లో 105 మంది మృతిచెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరో 350 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు. గత రెండు వారాలుగా లెబనాన్లో ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో చనిపోయినవారి సంఖ్యలో 1000 దాటినట్లు పేర్కొన్నారు. మరో 6 వేల మంది గాయపడ్డారు.
దక్షిణ లెబనాన్లోని సిడాన్తో పాటు తూర్పు ప్రాంతంలో జరిగిన భీకర వైమానిక దాడుల్లో డజన్లు కొద్దీ పౌరులు మరణించినట్టు వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున బీరుట్ నగరం కోలా ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ భవనం పైఅంతస్తుపై ఐడీఎఫ్ బాంబులు ప్రయోగించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు తెలిపారు. ఇప్పటివరకు హెజ్బొల్లా స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేసిన ఐడీఎఫ్... రూటు మార్చి నివాస సముదాయాలపై విరుచుకుపడింది. దీంతో మరింత ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉంది. నివాస సముదాయాల్లోనే హెజ్బొల్లా తమ ఆయుధాలు, క్షిపణులను దాచిపెట్టిందని, వాటిని నిర్వీర్యం చేస్తామని ఇప్పటికే ఐడీఎఫ్ స్పష్టం చేసింది. ఆ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ప్రజలను హెచ్చరించింది.
మరోవైపు, కోలా ప్రాంతంలో జరిగిన దాడిలో తమ సంస్థకు చెందిన ముగ్గురు నాయకులు చనిపోయినట్టు ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా’ ప్రకటించడం గమనార్హం. లెబనాన్లో జరిగిన దాడుల్లో మరో ఫ్రెంచ్ పౌరుడు చనిపోయినట్టు ఫ్రాన్స్ ప్రకటించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి జేన్ నోయిల్ బరోట్ లెబనాన్ పర్యటనకు వచ్చిన సమయంలో ఈ ప్రకటన వెలువడింది. ఇజ్రాయేల్ భీకర దాడులు తర్వాత తొలిసారి లెబనాన్లో విదేశీ నేత పర్యటించడం ఇదే మొదటిసారి.
మరోవైపు, ఇజ్రాయేల్ దాడిలో హతమైన సయ్యద్ హసన్ నస్రల్లా మృతదేహాన్ని హెజ్బొల్లా స్వాధీనం చేసుకుంది. ఆయన మృతదేహంపై ఎటువంటి గాయాలు లేవని, పేలుడు తీవత్రకు ఆయన గుండెపోటుకు గురయి ఉంటారని రాయిటర్స్ పేర్కొంది. అటు, హెజ్బొల్లా కొత్త చీఫ్ ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. నస్రల్లా వారసుడిగా అతడి సమీప బంధువు హషేమ్ సఫీద్దీన్ను ఎన్నుకొన్నట్లు ప్రచారం జరిగింది. కానీ, అవన్నీ తప్పుడు కథనాలని ఆ గ్రూప్ తమ అధికారిక టెలిగ్రామ్ ఛానల్లో వెల్లడించింది. నాయకత్వ బాధ్యతలపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది.