కేసు విచారణ సమయంలో ధర్మాసనాన్ని ఉద్దేశించి లాయర్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీరు ఉన్నది కాఫీ షాప్లో కాదని, న్యాయస్థానంలో అని లాయర్కు గుర్తుచేశారు. వాడిన పదజాలం, హావభావాలు అసహ్యకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ను ప్రతివాదిగా చేర్చిన 2018 నాటి పిటిషన్ను న్యాయవాది ప్రస్తావించారు. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ.. ‘ఇది ఆర్టికల్ 32కి సంబంధించిన కేసు కదా? అలాంటప్పుడు జస్టిస్ గొగోయ్ను ఎలా ప్రతివాదిగా పేర్కొంటారు?’ అని ప్రశ్నించారు. ఆర్టిలక్ 32 అనేది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు రాజ్యాంగపరమైన పరిష్కారాలను పొందే హామీ ఇస్తుంది.
సీజేఐ ప్రశ్నకు బదులిస్తూ.. ‘అవునవును.. జస్టిస్ రంజన్ గొగొయ్ క్యూరిటేవ్గా చేయమని నన్ను అడిగారు’ చెబుతుండగా.. సీజేఐ జోక్యం చేసుకున్నారు. ‘ఇదేమీ కాఫీ షాప్ కాదు.. ఏంటి మీ భాష.. ఇది చాలా అసహ్యకరంగా ఉంది.. ఇటువంటి పదజాలాన్ని మేము అంగీకరించం’ అని మందలించారు. ‘జస్టిస్ గొగొయ్ ఈ కోర్టులో మాజీ న్యాయమూర్తి.. ఆయనపై ఇటువంటి పిటిషన్ వేయలేరు.. ధర్మాసనం ముందుకు దీనిని తీసుకురావడంలో విఫలమైనందున అంతర్గత విచారణను కోరండి’ అని స్పష్టం చేశారు.
అయితే, ‘జస్టిస్ గొగొయ్ నేను చట్టవిరుద్దమని చేసిన ప్రకటనపై ఆధారపడి నా అభ్యర్థనను తోసిపుచ్చారు... ఇది అన్యాయం.. నా తప్పు ఏమీ లేదు.. కార్మిక చట్టాలపై అవగాహన ఉన్న ధర్యాససం ముందుకు నా రివ్యూ పిటిషన్ పంపాలని అభ్యర్థించాను. కానీ అలా జరగకపోగా కొట్టిపారేశారు’ అని లాయర్ తెలిపారు. హైకోర్టు తీర్పును సవాల్ చేసినప్పుడు న్యాయమూర్తిని తప్పుబట్టలేమని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ను రిజిస్ట్రీ పరిశీలిస్తుందన్న సీజే.. ప్రతివాదిగా పిటిషన్లో పేర్కొన్న జస్టిస్ రంజన్ గొగొయ్ పేరును తొలగించాలని లాయర్కు సూచించారు. కాగా, గతంలోనూ సుప్రీం కోర్టులో లాయర్ల తీరుపై జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.