తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి చర్చనీయాంశమయ్యారు. తనపై కొందరు చేసిన ఆరోపణలపై టీడీపీ అధిష్ఠానం సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఇవాళ (సోమవారం) ఆయన దీక్షకు దిగారు. తిరువూరులో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం తన క్యాంప్ కార్యాలయం ముందు ఆయన దీక్ష మొదలుపెట్టారు.
విచారణ జరిపి ఎవరు తప్పు చేసి ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తన మద్దతుదారులతో కలిసి ఆయన దీక్షకు దిగారు. కాగా ఇటీవల చిట్యాల సర్పంచ్పై ఎమ్మెల్యే వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పనితీరును ఇటీవల అధిష్ఠానం ఆరాతీసినట్టు తెలుస్తో్ంది. ఈ మధ్యే స్థానిక నాయకులకు టీడీపీ కాల్ సెంటర్ నుంచి ఐవీఆర్ఎస్ ఫోన్కాల్స్ వెళ్లాయి. ‘మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. అందరినీ కలుపుకొని పోతున్నారా.. చిట్యాల సర్పంచ్పై ఎమ్మెల్యే వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా లేదా’ వంటి ప్రశ్నలు అడిగారు. కాగా, ఎమ్మెల్యే పనితీరు, వ్యవహారశైలి కారణంగా పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని మనస్థాపం చెందుతున్న కొందరు నాయకులు ఇక్కడ జరిగే విషయాలను అధిష్ఠానానికి తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. స్థానికంగా జరుగుతున్న అంశాలను టీడీపీ కాల్ సెంటర్తో పంచుకున్నారు.