ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైకర్‌ను వెంబడించి దాడి చేసి చంపేసిన ఖడ్గమృగం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

national |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 09:48 PM

వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఓ బైకర్‌పై ఖడ్గమృగం దాడి చేసి ప్రాణాలు తీసిన ఘటన అసోంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కమ్రూప్‌ మెట్రోపాలిటన్‌ జిల్లాకు చెందిన సద్దాం హుస్సేన్‌ (37) అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై పొబితోరా అభయారణ్యం మీదుగా వెళ్తున్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ ఒంటి కొమ్ము ఖడ్గమృగం అతడ్ని వెంబడించి, దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హుస్సేన్‌ ప్రాణాలు కోల్పోయాడు.


అటవీశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘వన్యప్రాణుల అభయారణ్యం నుంచి ఖడ్గమృగం బయటకు వచ్చింది.. ఈ ఘటనపై మేము దర్యాప్తు చేస్తున్నాం’ అని చెప్పారు. అయితే, స్థానికులపై ఖడ్గమృగాలు ఇలా దాడి చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. నేషనల్ పార్కులో సఫారీకి వెళ్లిన పర్యాటకుల జీపులపై కూడా పలుమార్లు దాడికి యత్నించాయి. కిలోమీటర్ల మేర వెంబడించి భయాందోళనలు సృష్టించాయి.


తాజా ఘటనలో ఖడ్గమృగం దాడి చేయడంతో బైక్‌పై వదిలి బాధితుడు.. దానిని నుంచి తప్పించుకోడానికి పొలాల్లోకి పరుగెత్తాడు. కానీ, అది గంటకు 55 కి.మీ. వేగంతో వెంబడించడంతో దొరికిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు.. కేకలు వేస్తూ ఖడ్గమృగాన్ని అక్కడ నుంచి తరిమేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హుస్సేన్‌ను కుళ్లబొడిచి, తొక్కిపడేసింది.


ప్రపంచంలోనే అత్యధికంగా ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు అసోంలో ఉన్నాయి. ఇటీవల ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన డేటా ప్రకారం.. భారత్‌లో ఒక కొమ్ము గల ఆసియా ఖడ్గమృగాల సంతతి గత నాలుగు దశాబ్దాల్లో దాదాపు మూడు రెట్లు పెరిగింది. నాలుగు దశాబ్దాల క్రితం 1,500గా ఉన్న వీటి సంఖ్య ప్రస్తుతం 4 వేలకు పెరిగింది. ప్రపంచంలోని ఒంటి కొమ్ము ఖడ్గమృగాల్లో 80 శాతం.. ఒక్క కజిరంగా నేషనల్‌ పార్క్‌లో ఉన్నట్లు అంచనా. అంతరించిపోతున్న ఈ ఖడ్గమృగాల పరిరక్షణ కోసం అసోం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పలు రకాల జంతువులు, పక్షులు, పులుల సహా వన్యప్రాణులకు నెలవైన కజిరంగా నేషనల్‌ పార్కును 1985లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com