ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం కొత్త స్కీమ్,,,ఎలక్ట్రిక్ టూ వీలర్లపై రూ.10 వేల రాయితీ,,,త్రీ-వీలర్లకు రూ.50 వేల సబ్సిడీ

business |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 09:59 PM

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కొత్త పథకాలను అందుబాటులోకి తెస్తోంది. ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పన, విద్యుత్తు వాహనాల వినియోగం పెంపు వంటి వాటి కోసం పీఎం ఇ-డ్రైవ్ పేరుతో కొత్త పథకాన్ని అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి తీసుకొస్తోంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఒకటో తేదీ మంగళవారం రోజున ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ సహా ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,900 కోట్లు కేటాయించింది. ఈ సబ్సిడీ స్కీమ్ అక్టోబర్ 1, 2024 నుంచి మార్చి 31, 2026 వరకు అమలులో ఉంటుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.


పీఎం ఇ-డ్రైవ్ పథకంలో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులు, ఆటోలు, ఇ- అంబులెన్సులు, ట్రక్కులపై రాయితీ ఇవ్వనుంది కేంద్రం. బస్సుల కోసం అత్యధికంగా రూ.4,391 కోట్లు కేటాయించగా.. టూ-వీలర్ల కోసం రూ.1772 కోట్లు వెచ్చించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ టూవీలర్లు, త్రీవీలర్ల కేటగిరికీ వస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో బ్యాటరీ పవర్ ఆధారంగా కిలోవాట్‌కు రూ.5000, ఆ మరుసటి ఏడాది రూ.2,500 రాయితీ ఇవ్వనున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులకు మొదటి ఏడాది గరిష్ఠంగా రూ.10 వేల సబ్సిడీ అందనుందని కేంద్రం తెలిపింది. ఇక ఇ-రిక్షాలకు మొదటి ఏడాదిలో రూ.25 వేల సబ్సిడీ అందనుంది. రెండో ఏడాది రూ.12,500 రాయితీ వస్తుంది. ఎల్5 విభాగంలో అంటే కార్గో త్రీవీలర్ అయితే తొలి ఏడాది గరిష్ఠంగా రూ.50 వేల వరకు రాయితీ కల్పించనున్నారు. రెండో ఏడాదిలో రూ.25 వేల సబ్సిడీ ప్రయోజనాలు కల్పిస్తారు. ఈ పథకంలో పీఎం ఇ-డ్రైవ్ పోర్టల్‌లో ఆధార్ ధ్రువీకృత ఇ-ఐడీలను జారీ చేస్తామని కేంద్ర మంత్రి గతంలోనే తెలియజేశారు. కొనుగోలుదారులు, డీలర్లు సంతకాలు చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వాహనంతో సెల్ఫీ సైతం దిగి అప్‌లోడ్ చేయాలి.


ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఫేమ్-1 పథకం తీసుకొచ్చింది కేంద్రం. ఇందుకు రూ.795 కోట్లు కేటాయించి 2015, ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించింది. రెండేళ్లు ఈ స్కీమ్ అమలులో ఉంది. ఆ తర్వాత 2019 ఏప్రిల్ 1వ తేదీన రూ.11,500 కోట్లతో ఫేమ్-2 స్కీమ్ తెచ్చారు. ఈ స్కీమ్ 2024, మార్చి 31వ తేదీ వరకు అమలులో ఉంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అందుబాటులోకి తెచ్చారు. రూ.778 కోట్లు కేటాయించిన ఈ స్వల్ప కాలిక స్కీమ్ గడువు సెప్టెంబర్ 30, 2024తో ముగుస్తుంది. దాని స్థానంలో పీఎం ఇ-డ్రైవ్ పథకాన్ని అమలు చేయనుంది కేంద్రం. ఇది వచ్చే రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com