దేశంలో జరుగుతున్న బుల్డోజర్ కూల్చివేతల గురించి కొన్ని రోజుల క్రితమే సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. బుల్డోజర్ న్యాయం ఆపాలంటూ అన్ని రాష్ట్రాలకు సూచించింది. అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసినా.. ప్రభుత్వం కూల్చివేతలు ఆపడం లేదంటూ తాజాగా అస్సాం వాసులు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. కోర్టు ఆదేశాలు ధిక్కరించి.. ప్రభుత్వం కూల్చివేతలు చేస్తోందని బాధితులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు అస్సాం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వెంటనే కూల్చివేతలు ఆపాలని.. స్టేటస్ కో పాటించాలని పేర్కొంది.
సుప్రీంకోర్టులో అస్సాం ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అస్సాంలోని కామరూప్ జిల్లా మెట్రో డిస్ట్రిక్ట్ పరిధిలోని సోనపూర్ మువాజా ప్రాంతానికి చెందిన 47 మంది స్థానికులు.. ప్రభుత్వ కూల్చివేతలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కూల్చివేతలపై 3 వారాల్లో స్పందించాలని అస్సాం ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతానికి అక్కడ చేస్తున్న కూల్చివేతలను ఆపేసి స్టేటస్కో కొనసాగించాలని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు అనుమతి లేకుండా దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూల్చివేతలు చేపట్టవద్దని సెప్టెంబర్ 17వ తేదీన అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను అస్సాం సర్కార్ ఉల్లంఘించిందని పిటిషనర్ల తరఫున లాయర్ హౌజెఫా అహ్మది కోర్టుకు విన్నవించారు. అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సోనపుర్లో మార్కింగ్ చేసి కూల్చివేతలు మొదలుపెట్టినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇదే అంశంపై గౌహతి హైకోర్టులో అడ్వకేట్ జనరల్ ఇచ్చిన ప్రమాణపత్రాన్ని సుప్రీంకోర్టు ముందు ప్రవేశపెట్టారు. కూల్చివేత పిటిషన్లపై విచారణ పూర్తయ్యేవరకు నిర్మాణాలను కూల్చబోమని ప్రమాణ పత్రంలో పేర్కొన్నారని.. అయినా కూల్చివేతలు మాత్రం ఆపలేదని తెలిపారు.
అస్సాంలోని సోనపుర్ జిల్లా కచుతొలి పథార్ గ్రామానికి చెందిన 47 కుటుంబాలకు చెందిన ఇళ్లను కూల్చివేయాలని స్థానిక అధికారులు నిర్ణయించుకున్నారు. అసలైన భూ యజమానుల నుంచి కొనుగోలు చేసి.. పవర్ ఆఫ్ అటార్నీలు పొంది వారు అక్కడ జీవిస్తున్నట్లు అధికారులకు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ అధికారులు మాత్రం వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలకు దిగారని బాధితులు ఆరోపిస్తున్నారు.
అయితే ఇటీవల బుల్డోజర్ కూల్చివేతలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రోడ్లు, ఫుట్పాత్లు, రైల్వే లైన్లు, నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో కట్టిన నిర్మాణాలను మాత్రమే కూల్చివేయాలని.. మిగిలిన వాటిని కూల్చేముందు కోర్టుల అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. గత కొన్నిరోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అక్రమ నిర్మాణాలు అంటూ పేర్కొంటూ స్థానిక అధికారులు బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు.