ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వణికిస్తున్న చిరుత.. 11 రోజుల్లో ఏడుగురు బలి, ఒంటరిగా దాడులు!

national |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 09:32 PM

అటవీ జంతువులు.. జనావాసాల్లోకి వచ్చి మనుషులపై దాడులు చేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చిరుతలు, పులులు, ఏనుగులు, తోడేళ్లు.. ఇలా క్రూర జంతువులన్నీ గ్రామాలపై పడి.. దొరికిన వారిని దొరికినట్టే దాడి చేసి చంపుతుండటంతో అటవీ ప్రాంతాల సమీపంలో ఉండే ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో తోడేళ్ల దాడులు.. జిల్లా వ్యాప్తంగా ఎంతోమందిని బలితీసుకోగా.. మధ్యప్రదేశ్‌లోనూ అలాంటి దాడులే జరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా రాజస్థాన్‌లో చిరుత బెంబేలెత్తిస్తోంది. గత 11 రోజుల్లోనే ఏడుగురిని చంపేయడం స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.


రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ ప్రాంతంలో ఓ చిరుత.. అటు స్థానికులను, ఇటు అటవీ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. వరుసగా దాడులు చేస్తూ.. స్థానికంగా ఉన్న ఏడుగురిని పొట్టన పెట్టుకుంది. తాజాగా గోగుండా అనే ప్రాంతంలో ఆలయం సమీపంలో నిద్రిస్తున్న విష్ణుగిరి అనే 65 ఏళ్ల ఆలయ పూజారిపై చిరుత దాడి చేసింది. అనంతరం అతడ్ని అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లగా.. మృతదేహాన్ని.. సోమవారం ఉదయం స్థానికులు గుర్తించారు. ఆలయానికి 150 మీటర్ల దూరంలో విష్ణుగిరి మృతదేహం కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.


అయితే ఉదయ్‌పూర్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా చిరుత దాడులు పెరుగుతుండటం స్థానికులను నిద్రపోకుండా చేస్తోంది. గ్రామాలపై పడి దాడులు చేసి ప్రజలను చంపేస్తుండటం తీవ్ర భయాందోళనలకు దారి తీస్తోంది. అయితే ఆ చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు, పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. వివిధ ప్రాంతాల్లో ఆ చిరుత కోసం బోన్లు ఏర్పాటు చేసినా అది మాత్రం చిక్కడం లేదు. అయితే గత కొన్ని రోజులుగా కొన్ని చిరుతలు బోనులో పడ్డాయని.. అయినా దాడులు మాత్రం ఆగడం లేదని అటవీ అధికారులు పేర్కొన్నారు.


అయితే ఈ దాడులన్నీ ఒకే చిరుత చేస్తున్నట్లు అటవీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఘటనలు ఒకే రకంగా ఉన్నాయని గుర్తించారు. కానీ అదే నిజమని నమ్మలేమని.. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. చిరుత కదలికలు గుర్తించేందుకు పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక గత కొన్ని రోజులుగా చిరుత దాడులు క్రమంగా పెరుగుతుండటంతో స్థానికుల్లో భయం నెలకొంది. ఇక చిరుత భయంతో ఆ ప్రాంతంలో పాఠశాలలు మూసివేయగా.. చీకటి పడిన తర్వాత ప్రజలు బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. గుంపులు గుంపులుగానే కర్రలు, ఆయుధాలు పట్టుకుని బయటికి రావాలని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com