ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. భారతీయుల వీసాలపై బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 09:29 PM

అమెరికా వెళ్లాలంటే వీసా దొరకడానికి నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలుమార్లు ఈ సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనుండటం, ఇటీవలె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించిన వేళ.. వైట్‌హౌస్ ఈ నిర్ణయం తీసుకోవడం తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తాజాగా విడుదల చేసిన 2.5 లక్షల స్లాట్‌ల వల్ల ఎంతోమంది భారతీయులు సకాలంలో ఇంటర్వ్యూలు పూర్తి చేసుకోవడానికి దోహదం చేస్తాయని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్‌ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది.


అమెరికాకు రావాలనుకుంటున్న భారతీయులు సరైన సమయంలో వీసా ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి తాజాగా విడుదల చేసిన స్లాట్‌లు ఉపయోగపడతాయని అమెరికా ఎంబసీ వెల్లడించింది. ఇదే సమయంలో భారత్‌- అమెరికా మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం సహకరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. గతేడాది 10 లక్షలకుపైగా నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా అపాయింట్‌మెంట్లను విడుదల చేయగా.. ఈసారి కూడా 10 లక్షలు దాటి.. వరుసగా రెండో ఏడాది కూడా భారీగా వీసా అపాయింట్‌మెంట్‌లు విడుదల చేసినట్లు యూఎస్‌ ఎంబసీ పేర్కొంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం కుటుంబ సభ్యులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించింది.


ఇక గత సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో స్టూడెంట్ వీసాలు జారీ చేసినట్లు అమెరికా ఎంబసీ తెలిపింది. స్టూడెంట్ వీసాలు భారీగా జారీ చేయడం వరుసగా నాలుగో ఏడాది అని వెల్లడించింది. అయితే ఇప్పటివరకు ఎన్ని స్టూడెంట్ వీసాలు జారీ చేసిందనే విషయాన్ని మాత్రం అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించలేదు. 2023లో మాత్రం 1.4 లక్షల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు ఇచ్చినట్లు యూఎస్ ఎంబసీ తెలిపింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com