ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షర్మిల వర్సెస్ అచ్చెన్నాయుడు.. విత్తన కొరతపై వరుస ట్వీట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 07:35 PM

విత్తన కొరతపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మధ్య సోషల్ మీడియా వేదికగా ట్వీట్ల వార్ జరుగుతోంది. ఇరువురు నేతలూ ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. ఏపీలో విత్తనాల కొరతను ప్రశ్నిస్తూ వైఎస్ షర్మిల ఇటీవల ఓ ట్వీట్ చేశారు. సాగర్ కుడికాలవ ఆయకట్టు కింద సాగునీరు వచ్చిందని సంతోషించేలోపు.. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం 4 లక్షల మంది రైతుల పాలిట శాపంలా మారిందంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. విత్తనాలను అందుబాటులో ఉంచడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలమైందన్న షర్మిల.. పోలీసులను కాపలా పెట్టి టోకెన్లు ఇవ్వడం ఏంటి అంటూ ప్రశ్నించారు. మహిళలను సైతం విత్తనాల కోసం వర్షంలో క్యూలైన్లలో నిలబెడుతున్నారని.. తొక్కిసలాట జరుగుతున్నా పట్టించుకోలేదన్నారు. రైతు పక్షపాతి అని చెప్పుకొనే కూటమి సర్కారుకి ఇది తగదని.. బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టి రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.


మరోవైపు వైఎస్ షర్మిల ట్వీట్‌కు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా విత్తనాల కొరత లేదని.. రైతుల ప్రయోజనం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అచ్చెన్న ట్వీట్ చేశారు. సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా అడుగులు పడుతున్న రాష్ట్రంలో రైతులను అనవసర భయాలకు గురి చేయవద్దని.. ఇది మీ అన్నగారి ప్రభుత్వం కాదంటూ వైఎస్ షర్మిలకు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. అయితే అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణపైనా వైఎస్ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి తలాతోక లేని వివరణ ఇచ్చారన్న షర్మిల.. సాగర్ కుడికాలువ కింద రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా అని ప్రశ్నించారు. పల్నాడు జిల్లాలో కౌంటర్ల దగ్గర రైతుల పడుతున్న కష్టాలు మీకు కనిపించడం లేదా అని నిలదీశారు. సంక్షోభం నుంచి సంక్షేమం అంటే కుండపోత వర్షంలో మహిళలను ఇబ్బందులు పాలు చేయడమే కాబోలు అంటూ సెటైర్లు వేశారు. అలాగే రైతుల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ము లేక కుటుంబాన్ని గుంజుతున్నారంటూ వైఎస్ షర్మిల విమర్శించారు.


 రైతు సంక్షేమం గురించి పట్టించుకోకపోవటంతోనే వైసీపీ ప్రభుత్వాన్ని కాదని కూటమికి పట్టం కట్టారన్న షర్మిల.. వైఎస్ జగన్ నిండా ముంచారనే 11సీట్లకు పరిమితం చేశారన్నారు. రైతులను వ్యతిరేకించే బీజేపీతో కూటమి కట్టి, అధికారంలోకి వచ్చి రైతులను వర్షంలో నిలబెట్టారన్న షర్మిల.. రైతు అడిగింది ఇవ్వాలని ప్రశ్నిస్తే రెచ్చ గొట్టినట్లు ఎలా అవుతుందో వ్యవసాయశాఖ మంత్రి సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com