ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమర్‌నాథ్ వెళ్లే యాత్రికులకు బ్యాడ్‌న్యూస్.. యాత్రకు బ్రేక్

national |  Suryaa Desk  | Published : Sat, Jul 06, 2024, 11:19 PM

హిమాలయాల్లో కొలువైన అమర్‌నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా జనం జమ్మూ కాశ్మీర్‌కు క్యూ కడుతున్నారు. గతం కంటే రికార్డు స్థాయిలో యాత్రికులు.. అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తుతున్నారు. అయితే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో భారీగా వర్షాలు పడుతుండటంతో అమర్‌నాథ్ యాత్రకు ఆటంకం కలిగింది. భారీ వర్షాల నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రెండు మార్గాల్లో యాత్రను నిలిపివేస్తున్నట్లు శనివారం స్పష్టం చేశారు.


ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా యాత్రకు బ్రేక్ ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్‌ జిల్లాలోని ఎత్తైన అమర్‌నాథ్ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. జూన్ 29 వ తేదీన ప్రారంభం అయిన ఈ అమర్‌నాథ్ యాత్రలో భాగంగా తొలి వారం రోజుల్లోనే 1.5 లక్షల మంది యాత్రికులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఇది గతం కంటే చాలా ఎక్కువ అని అధికారులు తెలిపారు.


బాల్తాల్, పహల్గాం మార్గాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు మార్గాల నుంచి అమర్‌నాథ్‌కు వెళ్లే యాత్రికులను నిలిపివేసినట్టు చెప్పారు. అమర్‌నాథ్ గుహలో 3800 మీటర్ల ఎత్తులో ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది యాత్రికులు జమ్మూ కాశ్మీర్ చేరుకుంటూ ఉంటారు. ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణిస్తూ వివిధ మార్గాల నుంచి అమర్‌నాథ్ గుహకు చేరుకుని మంచు శివలింగాన్ని దర్శించుకుంటారు.


ఇక గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే అమర్‌నాథ్ యాత్రను స‌జావుగా నిర్వహించేందుకు స్థానిక అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్‌, ఐటీబీటీ, పారామిలిట‌రీ ద‌ళాలు.. భారీ స్థాయిలో గస్తీ కాస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఏరియ‌ల్ సర్వే కూడా చేస్తున్నారు. ఇక ఈ అమర్‌నాథ్ యాత్ర జూన్ 29 వ తేదీన ప్రారంభం కాగా.. ఆగ‌స్టు 19వ తేదీతో ముగియనుంది.


గతేడాది మొత్తం 4.5 లక్షల మందికిపైగా భక్తులు అమర్‌నాథ్‌ మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. అయితే ఈసారి అంతకంటే ఎక్కువ మంది అమర్‌నాథ్ యాత్రకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అమర్‌నాథ్ యాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com