ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ట్విస్ట్.. మాట మార్చిన మహిళ

national |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 10:18 PM

హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాల కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై ఫిర్యాదు చేసిన ఓ మహిళ మాట మార్చింది. పోలీసులమని చెప్పుకునే కొందరు వ్యక్తులు తనను వేధింపులకు గురిచేసి, తప్పుడు ఫిర్యాదు చేయమని బలవంతం చేశారని ఆమె పేర్కొన్నట్టు జాతీయ మహిళా కమిషన్ తాజాగా వెల్లడించింది. జాతీయ మహిళా కమిషన్ ప్రకటనపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి.. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు మరక అంటించాలని కోరుకుంటోందని దుయ్యబట్టారు.


ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల పెన్‌డ్రైవ్‌ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు ముందుకు సాగలేదని కుమారస్వామి మండిపడ్డారు. ఈ కేసులో జనతాదళ్‌కు మరక అంటించాలనేదే ప్రభుత్వ కుట్రగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వకుండే వ్యభిచారం కేసుల్లో బుక్ చేస్తామని బాధితులను సిట్ బెదిరిస్తోందని మాజీ సీఎం ఆరోపించారు.


తాము రక్షించినట్లు చెబుతున్న సిట్.. బాధితురాలిని ఇప్పటి వరకు ఎందుకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచలేదని ఆయన ప్రశ్నించారు. హెచ్‌డీ రేవణ్ణను జైల్లో ఉంచాలని మాత్రమే కాంగ్రెస్ సర్కారు భావిస్తోందన్నారు. ఒక ఫాంహౌస్‌ నుంచి రక్షించిన మహిళను.. ప్రభుత్వ గెస్ట్‌ గౌస్‌లో ఉంచి, హెచ్‌డీ రేవణ్ణ, ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం అందిందని తెలిపారు.


అయితే, ప్రజ్వల్ రేవణ్ణను సమర్ధించే ప్రశ్నే లేదని కుమారస్వామి పునరుద్ఘాటించారు. ‘‘ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందే.. తప్పుచేస్తే శిక్ష అనుభవించాల్సిందే. హెచ్‌డీ దేవెగౌడకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.. మాకు మా స్వంత వ్యాపారాలు, కుటుంబాలు ఉన్నాయి.. కేవలం అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే నేను హసనకు వెళ్లాను’ అని చెప్పారు.


కాగా, సిట్‌పై కుమారస్వామి చేసిన ఆరోపణలను కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర తోసిపుచ్చారు. ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంపై సిట్ దర్యాప్తు సీరియస్‌గానే సాగుతోందని అన్నారు. జేడీఎస్ చేస్తోన్న ఆరోపణలన్నింటికీ ప్రభుత్వం బదులివ్వాల్సిన అవసరం లేదన్నారు. దర్యాప్తు చురుకుగా కొనసాగుతున్న నేపథ్యంలో సీబీఐకి కేసును అప్పగించాల్సిన అవసరం లేదని హోం మంత్రి వ్యాఖ్యానించారు. దర్యాప్తు పూర్తయి నివేదిక సమర్పించిన తర్వాత వివరాలు బయటపెడతామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com