ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌కు మరో దౌత్య విజయం.. ఐదుగురు భారతీయులను విడుదల చేసిన ఇరాన్

national |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 10:16 PM

భారత్‌కు అంతర్జాతీయంగా మరో విజయం దక్కింది. ఇరాన్ చెరలో ఉన్న భారతీయ నావికుల విడుదలకు చేసిన దౌత్య ప్రయత్నం ఫలించింది. గత నెలలో ఇజ్రాయేల్‌కు చెందిన వాణిజ్య నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ నౌకలోని ఐదుగురు భారతీయ సెయిలర్లను ఇరాన్ గురువారం విడుదల చేసింది. ఇజ్రాయేల్‌‌ కుబేరుడు ఇయాల్‌ ఒఫర్‌ జోడియాక్‌ సంస్థకు చెందిన వాణిజ్య నౌక ఎంఎస్‌సీ ఏరిస్‌‌ దుబాయ్‌ తీరానికి వెళ్తుండగా.. ఏప్రిల్ 13న హర్మూజ్ జల సంధి వద్ద ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్ కమాండోలు స్వాధీనం చేసుకుని తమ ప్రాదేశిక జలాల్లోకి తరలించారు.


ఈ నౌకలోని 25 మంది సిబ్బందిలో 17 మంది భారతీయులే. వారిని విడిపించేందుకు విదేశాంగ శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఎంఎస్‌సి ఏరీస్‌లో ఉన్న ఐదుగురు భారతీయ సెయిలర్లు విడుదలైనట్టు ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌ (ట్విట్టర్) ద్వారా వెల్లడించింది. గురువారం సాయంత్రం ఈ ఐదుగురు ఇరాన్ నుంచి బయలుదేరారని తెలిపింది. బందర్ అబ్బాస్‌లోని భారత్ ఎంబసీతో ఇరాన్ అధికారులు సమన్వయం చేసుకున్నందుకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ధన్యవాదాలు తెలిపారు.


ఏప్రిల్ 18న ఇదే నౌకలోని కేరళకు చెందిన టెస్సా జోసెఫ్‌ అనే నావికురాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె తన స్వస్థలం త్రిస్సూరుకు క్షేమంగా చేరుకున్నారు. నౌకలోని 17 మంది భారతీయుల్లో ఒకరు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. భారతీయ నావికులను తాము నిర్బంధించలేదని న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబారి తెలిపారు. నౌకలోని భారత సెయిలర్లను విడుదల అంశంపై ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సెన్ అమీర్ అబ్దుల్లాహియన్‌తో జైశంకర్ చర్చించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com