ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బార్‌లో ఫుల్లుగా మద్యం తాగిన ముగ్గురు యువతులు.. బయటికొచ్చి ఏం చేశారంటే

national |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 10:10 PM

పరిమితంగా మద్యం సేవించిన వారు బార్, వైన్స్ నుంచి తమ ఇంటికి తాము చాలా జాగ్రత్తగా, సైలెంట్‌గా వెళ్లిపోతారు. అలా కాకుండా ఫుల్లుగా తాగిన వారు.. అసలు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియకుండానే నానా హంగామా సృష్టిస్తూ ఉంటారు. అలాగే బాగా మద్యం తాగిన ఓ ముగ్గురు యువతులు మహారాష్ట్రలో నడిరోడ్డుపై రచ్చ చేశారు. బార్‌లో విపరీతంగా మద్యం సేవించిన ఆ ముగ్గురు యువతులు.. బార్ బయటికి వచ్చి కొందరు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అంటూ వింత వాదన తీసుకువచ్చారు. అది కాస్తా ఎక్కువ కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక పోలీసులు రంగ ప్రవేశం చేసిన తర్వాత అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది.


ముంబై సమీపంలోని విరార్‌ ప్రాంతంలో అర్ధరాత్రి హల్‌చల్‌ చేశారు. గురువారం అర్ధరాత్రి గోకుల్ టౌన్‌షిప్‌లో ఉన్న ఓ రెస్టారెంట్ అండ్ బార్‌లో కావ్య, అశ్విని, పూనమ్‌ అనే ముగ్గురు యువతులు మద్యం సేవించారు. ఆ తర్వాత బార్ బయటికి వచ్చిన యువతులు అక్కడ రచ్చ రచ్చ చేశారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. ఆ ముగ్గురు యువతులు బార్‌లోని ఇతర కస్టమర్లతో గొడవకు దిగుతున్నారని.. అందుకే వారిని బయటికి పంపించినట్లు బార్ యాజమాన్యం పోలీసులకు తెలిపింది. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని ముగ్గురు యువతులకు పోలీసులు సూచించారు.


దీంతో కావ్య, అశ్విని, పూనమ్.. పోలీసులపైకే వాగ్వాదానికి దిగారు. ఒక యువతి ఏకంగా ఇన్‌స్పెక్టర్‌ కాలర్‌ పట్టుకుని గొడవకు దిగింది. వారిని బూతులు తిడుతూ చివరికి దాడి కూడా చేశారు. మద్యం మత్తులో ఉన్న ఓ యువతి.. ఏకంగా మహిళా పోలీస్ చేతిని కొరికి.. ఆమె యూనిఫాంను చింపేసింది. అంతేకాకుండా మరో కానిస్టేబుల్‌ను బకెట్‌తో కొట్టి.. మణికట్టుపై కొరికినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఆ ముగ్గురు యువతుల్లోని ఒక యువతి.. ఆమెను ఆపేందుకు ప్రయత్నించింది. అయితే ఆ యువతుల రచ్చ చూసిన స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి తెగ వైరల్‌గా మారాయి.


ఆ యువతులు పోలీసులను తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తించడంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితి తలెత్తింది. దీంతో పోలీసులు అతి కష్టం మీద ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఆ యువతులపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com