ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెయిల్ ఇచ్చినా కేజ్రీవాల్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. ఆ పని చేయొద్దంటూ ఆదేశాలు

national |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 10:01 PM

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎట్టకేలకు ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. జూన్ 1 వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. ఈ క్రమంలోనే బెయిల్ మంజూరు చేస్తూ.. అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు కొన్ని షరతులు విధించింది. ఆయన బెయిల్‌పై తీహార్ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏమేం చేయాలో.. ఏమేం చేయకూడదు అనే విషయాలను బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టు స్పష్టం చేసింది. బెయిల్‌పై బయట ఉన్న సమయంలో కేజ్రీవాల్.. ఢిల్లీ సీఎం కార్యాలయానికి వెళ్లొద్దని ఆదేశించింది. అంతేకాకుండా ఎలాంటి ఫైల్స్ మీద సంతకాలు చేయవద్దని పేర్కొంది.


ఢిల్లీ లిక్కర్ కేసులో తాజాగా బెయిల్ పొందిన అరవింద్‌ కేజ్రీవాల్‌.. జూన్ 1 వ తేదీ వరకు 21 రోజుల పాటు బయట ఉండనున్నారు. అయితే జైలు నుంచి రిలీజ్ కావడానికి ముందే రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో కేజ్రీవాల్ బాండ్ సమర్పించాలని పేర్కొంది. ఇక బెయిల్‌పై ఉన్న 21 రోజుల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయానికి గానీ.. ఢిల్లీ సచివాలయానికి గానీ వెళ్లకూడదని నిషేధం విధించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికల ప్రచారాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రచారం చేయవచ్చని తెలిపింది.


 ఇక ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా అనుమతి లేకుండా ఎలాంటి అధికారిక ఫైళ్లపై సంతకం చేయకూడదని అరవింద్ కేజ్రీవాల్‌కు సూచించింది. అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు గురించి ఎలాంటి ఆరోపణలు చేయకూడదని ఆదేశించింది. ఈ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనపై వచ్చిన ఆరోపణల గురించి కూడా ప్రస్తావించకూడదని సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు సూచించింది. ఇక ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సాక్ష్యులుగా ఉన్న వ్యక్తులను కేజ్రీవాల్ కలవకూడదని.. వారితో మాట్లాడకూడదని బెయిల్ మంజూరు సమయంలో సుప్రీంకోర్టు అరవింద్ కేజ్రీవాల్‌కు షరతులు విధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com