ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీహార్ జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్.. మొదటి మాట ఏమన్నారంటే

national |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 10:00 PM

ఢిల్లీ లిక్కర్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. 50 రోజుల తర్వాత బయటికి వచ్చారు. శుక్రవారం ఉదయం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన తీహార్ జైలు నుంచి బయటికి వచ్చారు. కేజ్రీవాల్ విడుదల సందర్భంగా తీహార్ జైలు వద్ద భారీగా జనసందోహం కనిపించింది. కేజ్రీవాల్ సతీమణి సునీత, ఢిల్లీ మంత్రులు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తీహార్ జైలు వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే జైలు నుంచి ఆయన నివాసానికి భారీ ర్యాలీతో కేజ్రీవాల్ తరలి వెళ్లారు.


ఈ క్రమంలోనే జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మాట్లాడిన కేజ్రీవాల్.. జైలు నుంచి త్వరలోనే బయటికి వస్తా అని మాటిచ్చానని.. ఇచ్చిన మాట ప్రకారం బయటికి వచ్చి మీ ముందు నిల్చున్నాని తెలిపారు. ఈ సందర్భంగా తాను దేశ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపిన కేజ్రీవాల్.. నియంతృత్వం నుంచి దేశాన్ని రక్షించాలని పేర్కొన్నారు. దాని కోసం తాను సర్వశక్తితో పోరాడుతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా జైలు నుంచి అతి త్వరలోనే బయటికి వస్తానని ఆప్ కార్యకర్తలకు గతంలోనే మాటిచ్చానని గుర్తు చేసుకున్నారు.


  ఈ సందర్భంగా భారత్‌ మాతాకీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, వందేమాతరం నినాదాలతో కేజ్రీవాల్ ర్యాలీని హోరెత్తించారు. ఈ క్రమంలోనే తనకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జడ్జిలకు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. ఇక శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని కన్నౌట్ ప్లేస్‌లో ఉన్న హనుమాన్ ఆలయాన్ని తాను సందర్శించనున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటలకు పార్టీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌.. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదని సుప్రీంకోర్టు తెలిపింది. అంతేకాకుండా 21 రోజులు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఏం తేడా ఉండదని పేర్కొంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌పై కోర్టు పలు ఆంక్షలు విధించింది. జూన్ 1 వ తేదీ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. జూన్ 2 వ తేదీన తిరిగి తీహార్‌ జైలులో సరెండర్ కావాలని కేజ్రీవాల్‌కు సూచించింది. కేవలం లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ ఇచ్చినట్లు స్పష్టం చేసింది. మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న 7 స్థానాలకు ఆరో విడతలో మే 25 వ తేదీన పోలింగ్ జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com