ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింహాచలంలో వైభవంగా చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనానికి భక్తుల క్యూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 09:05 PM

విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ)ను పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూపాన్ని భక్తులు దర్శించుకుంటున్నారు. ముందుగా ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.. అనంతరం స్వామివారి తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తుల్ని దర్శనానికి అనుమతించారు. వేకువజాము నుంచి స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.


మరోవైపు శుక్రవారం వేకువజాము నుంచి చందనోత్సవ వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలో సుప్రభాత సేవ అనంతరం వెండి బొరుగుతో స్వామిపై ఉన్న చందనాన్ని ఒలిచారు అర్చకులు. ఆ తర్వాత ఆరాధన కార్యక్రమం నిర్వహించి.. తొలి దర్శనాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజుకు అందజేశారు. అనంతరం పలువురు ప్రముఖులకు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఇవాళ రాత్రి 9 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకాన్ని వైభవంగా నిర్వహిస్తారు. శ్రీ వైష్ణవస్వాములు గంగధార నుంచి 1008 కలశాలతో నీటిని తీసుకొచ్చి నృసింహస్వామి వారి నిజరూపాన్ని అభిషేకిస్తారు. అనంతరం ఆలయ అర్చకులు తొలివిడత చందనాన్ని సమర్పిస్తారు.


నిజరూప దర్శనానికి సంబంధించి టికెట్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయించారు. ఈ టికెట్లు లేని భక్తులు ఉచిత దర్శనం ద్వారా క్యూ లైన్లలో నుంచి స్వామివారిని దర్శించుకోవచ్చు. ప్రతి ఏటా అప్పన్నకు అక్షయ తృతీయ రోజున నిర్వహించే చందనోత్సవం చాలా విశిష్టమైనదని భక్తులు చెబుతుంటారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com