వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ఇంఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. భార్గవ్ పై 171f, 171g, 505(2), రెడ్ విత్120బి ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు ఫైల్ అయ్యింది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ.. ఆ పార్టీ సీనియర్ నేత వర్లరామయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఈసీ కేసు నమోదు చేయాలని సీఐడీని ఆదేశించగా.. సీఐడీ కేసు నమోదు చేసింది.
సజ్జల భార్గవ్ ఆధ్వర్యంలో ఓటర్లను, పింఛన్ లబ్ధిదారులను తప్పుదోవ పట్టించేలా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా పింఛన్ల ఇంటికి ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేశారని టీడీపీ చెబుతోంది. రాష్ట్రంలో వృద్ధులకు ఏప్రిల్ 1న పింఛన్లు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని.. సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని.. రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేయగా.. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు సీఐడీ నుంచి నివేదిక వెళ్లాల్సి ఉంది. అనంతరం ఎలాంటి చర్యలు ఉంటాయన్నది చూడాలి.