ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పగలు వారితో.. రాత్రి వీరితో.. చంద్రబాబుపై పంచులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 08:53 PM

ఏపీలో ఎన్నికలు క్లైమాక్స్ చేరుకున్నాయి. ప్రచార పర్వం ముగుస్తుండటంతో నేతల మాటల్లో తీవ్రత పెరిగింది. ఈ క్రమంలోనే కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్ షర్మిల, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కడపలోని పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడిన వైఎస్ జగన్.. చంద్రబాబును గెలిపించేందుకే ఏపీలోకి కాంగ్రెస్ మళ్లీ వచ్చిందని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. చంద్రబాబు మనిషిగా పేర్కొన్న జగన్.. చంద్రబాబును గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పగలు బీజేపీతో.. రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తారని ఎద్దేవా చేశారు.


ఇదే సమయంలో చెల్లెలు వైఎస్ షర్మిల మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షర్మిల పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాజకీయంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని అణగదొక్కాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.


"కడప జిల్లాలో ఉన్నంత రాజకీయ చైతన్యం ఏపీలోని అతికొద్ది జిల్లాలలో మాత్రమే ఉంటుంది. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో మీకు తెలుసు. అప్పుడు నేను ఇండిపెండెంట్‌గా కడప నుంచి పోటీచేసినప్పుడు మీరు సుమారు ఐదు లక్షలకుపైగా మెజారిటీ ఇచ్చారు. ఆ తర్వాత నేను ఢిల్లీలో ప్రమాణం చేస్తుంటే పార్లమెంటులోని ప్రతీ తలకాయ ఎవరీ జగన్ అని చూశారు. అంతటి చైతన్యం ఉంది కడప జిల్లా ప్రజలకు. కానీ ఇప్పుడు నోటా కంటే తక్కువ వచ్చిన పార్టీలతో, రాష్ట్రవిభజన చేసిన దుర్మార్గులతో జత కడతారా" అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.


"రాజకీయంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని అణగదొక్కాలని దేశంలోని అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగిస్తున్నారు. ఇప్పుడేమో అదే కాంగ్రెస్, టీడీపీతో కలిసిపోయి.. వైఎస్ఆర్ అనే పేరే కనబడకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారు. వీళ్లా వైఎస్ఆర్ వారసులు.. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన పేరు ప్రతిష్టలను దెబ్బతీయాలని చూసిన పార్టీ కాంగ్రెస్. ఆయన పేరును ఛార్జిషీట్లో పెట్టారు. ఆయన కొడుకును 16 నెలలు జైళ్లో పెట్టారు. ఆ 16 నెలలు నాకు ఎవరిస్తారని అడుగుతున్నా. ఇప్పుడేమో మేమే వైఎస్ఆర్ పేరును ఛార్జిషీట్లో పెట్టామంటున్నారు. అసలీ పార్టీకీ మానవతా విలువలు ఉన్నాయా" అని జగన్ ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com