ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకౌంట్లలోకి డబ్బుల జమపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. డబ్బులు పడేది అప్పుడే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 07:48 PM

ఏపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. డీబీటీ ద్వారా నగదు బదిలీపై ఏపీ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరిస్తూ పోలింగ్ ముగిసిన మరుసటి రోజు అంటే మే14వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మే పదో తేదీ ఒక్కరోజు నగదు బదిలీకి వెసలుబాటు ఇస్తూ గురువారం హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై అప్పీలు పిటిషన్ దాఖలు కాగా.. శుక్రవారం హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ విచారించింది.


ఈ సందర్బంగా ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్.. నిధులు విడుదల చేయాల్సినవన్నీ పాత పథకాలేనని వాదించారు. లబ్ధిదారుల ఎంపిక కూడా గతంలోనే పూర్తయ్యిందని.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా లబ్ధిదారుల ఎంపిక జరగలేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. డీబీటీ ద్వారా నగదు బదిలీపై సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వలేదని అన్నారు. దీంతోనే నిధులు విడుదల చేయలేదని చెప్పారు. అయితే ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్.. పోలింగ్ తరువాతి రోజు అంటే మే 14వ తేదీ డీబీటీ ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చంటూ ఈసీ ఇచ్చిన ఆదేశాలను కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.


వైఎస్ఆర్ చేయూత, విద్యాదీవెన, ఇన్ పుట్ సబ్బిడీ వంటి పథకాలకు సంబంధించి రూ.14వేల కోట్లకు పైగా నిధులను డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల ఈసీ అనుమతి కోరింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో దీనికి అనుమతించలేమని.. పోలింగ్ పూర్తైన తర్వాత విడుదల చేయవచ్చంటూ ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈసీ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేయగా.. ఈసీ ఉత్తర్వులపై శుక్రవారం ఒక్కరోజు హైకోర్టు స్టే విధించింది.


దీంతో శుక్రవారం నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి వెసలుబాటు దొరగ్గా.. క్లారిటీ కోసం అధికారులు ఈసీని సంప్రదించారు. అయితే ఈలోపే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్‌కు అప్పీలుకు వెళ్లటంతో శుక్రవారం నగదు బదిలీ నిలిచిపోయింది. మరి ఈసీ, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మే 14న నిధులు విడుదల జరుగుతుందేమో చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com