ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టన్ నొక్కి చాలా రోజులైంది.. ఇప్పటి వరకూ ఎందుకివ్వలేదు? : ఈసీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 07:44 PM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీపై సస్పెన్ష్ కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో ఈ రోజు(మే10) డీబీటీల ద్వారా లబ్ధిదారులకు నగదు బదిలీ చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి అవకాశం కలిగింది. అయితే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి ట్విస్ట్ ఇచ్చింది. నగదు బదిలీ పథకాలపై ఏపీ ప్రభుత్వానికి మరోసారి లేఖ రాసిన ఎన్నికల సంఘం.. బటన్‌ నొక్కి ఇన్నిరోజులైనా ఇప్పటి వరకూ ఎందుకు లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమచేయలేదని ప్రశ్నించింది. జనవరి నుంచి వారాల పాటు నిధుల జమ ఆపి.. ఇప్పుడే పోలింగ్ తేదీ ముందు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించింది. వారాల పాటు ఆపి ఇవాళ నిధులు విడుదల చేయకపోతే ఏమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జనవరి 24వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకూ ఏపీ ఆర్థిక పరిస్థితి తమకు తెలియజేయాలని లేఖలో స్పష్టం చేసింది.


ఇదే సమయంలో గత ఐదేళ్ల కాలంలో బటన్ నొక్కిన సమయానికి, నిధులు బదిలీ అయిన సమయానికి మధ్య వ్యవధి ఎంతో చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ఇవాళే (మే 10) నిధులు విడుదల చేయాలని ముందే నిర్ణయించారా.. అలా నిర్ణయించి ఉంటే దానికి సంబంధించిన పత్రాలను పంపాలని లేఖలో స్పష్టం చేసింది. తమ లేఖ మీద మే పదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలలోపు సమాధానం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.


మరోవైపు విద్యాదీవెన, వైఎస్ఆర్ చేయూత, రైతులకు ఇన్‌‌పుట్ సబ్సిడీ వంటి పథకాలకు సంబంధించి సుమారు 14 వేల కోట్ల రూపాయలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల ఎన్నికల సంఘం అనుమతి కోరింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నగదు బదిలీ వద్దని.. ఎన్నికలు పూర్తయ్యే వరకూ నిధుల విడుదలను ఈసీ నిలుపుదల చేసింది. అయితే ఈసీ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిధుల విడుదల చేయవద్దన్న ఈసీ ఆదేశాలపై స్టే విధించింది. మే పదో తేదీ వరకూ ఈసీ ఆదేశాలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది అలాగే మే 11 నుంచి 13 వరకూ నిధులు విడుదల చేయవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈసీ ఆదేశాలపై స్టే విధించడంతో మే పదో తేదీ నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి అవకాశం దొరికింది. అయితే ఏపీ ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం ఈసీ పరిధిలో ఉన్నందున నిధుల విడుదలకు వారి నుంచి క్లారిఫికేషన్ రావాల్సి ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వ అధికారులు ఈసీని సంప్రందించగా.. ఈసీ పలు ప్రశ్నలు సంధిస్తూ.. లేఖ రాసింది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలలోపు దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com