ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ జిల్లాలో గెలిచే పార్టీదే అధికారం.. 15 స్థానాల్లో ఎవరెవరు, వార్ వన్ సైడ్ అవుతుందా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 07:38 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశాఖపట్నం రాజకీయాలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ జిల్లా నుంచి ఎంతోమంది హేమా హేమీ రాజకీయ నేతలు ప్రాతినిధ్యం వహించారు.. రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాగా చెబుతారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వ్యవసాయంతో పాటుగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు ఉన్నారు.. అలాగే గిరిజన ప్రాంతం కూడా ఉంది. ఉమ్మడి చిత్తూరు విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లా తెలుగు దేశం పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా ఉంది. 2104 ఎన్నికల్లో టీడీపీ హవా కనిపించగా.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మెజార్టీ స్థానాలను దక్కించుకుంది. ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీదే రాష్ట్రంలో అధికారమని చెబుతారు.. 2014, 2019 ఎన్నికల్లో అదే జరిగింది.


ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఈ జిల్లాలో 2014 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అత్యధికంగా 11 చోట్ల విజయం సాధించగా.. వైఎస్సార్‌సీపీ మూడు సీట్లలో గెలిచింది.. బీజేపీ ఒకచోట విజయాన్ని అందుకుంది. ఇక 2019 ఎన్నికల విషయానికి వస్తే.. వైఎస్సార్‌సీపీ 11 స్థానాల్లో గెలిస్తే.. టీడీపీ నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధించింది.


ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 3 లోక్ సభ స్థానాలు


విశాఖపట్నం, అనకాపల్లి, అరకు లోక్ సభ స్థానాలు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా ఎంవీవీ సత్యనారాయణ గెలిచారు. 2024 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా మతుకుమల్లి భరత్ పోటీ చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున బొత్స ఝాన్సీ బరిలో ఉన్నారు.. కాంగ్రెస్ పార్టీ నుంచి పులుసు సత్యనారాయణ రెడ్డి పోటీలో నిలిచారు.


2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా వైఎస్సార్సీపీ నుంచి సత్యవతి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వేగి వెంకటేశ్‌‌‌ బరిలో ఉన్నారు.


2019 ఎన్నికల్లో అరకు ఎంపీగా వైఎస్సార్‌సీపీ నుంచి గొట్టేటి మాధవి గెలిచారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సిట్టింగ్ ఎంపీ మాధవిని పక్కన పెట్టి చెట్టి తనూజ రాణిని పోటీ చేయిస్తోంది. టీడీపీ, బీజేప, జనసేన కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత బరిలో ఉన్నారు.


విశాఖపట్నం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు


విశాఖపట్నం ఉత్తరం, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం పశ్చిమ, గాజువాక, పెందుర్తి, మాడుగుల, యలమంచిలి, భీమిలి, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, అరకు, పాడేరు, పాయకరావుపేట.


2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. కలిసి పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలు.. మొత్తం 9 స్థానాల్లో తెలుగు దేశం పార్టీ పోటీ చేస్తోంది.. జనసేన పార్టీ 4 చోట్ల.. బీజేపీ రెండు చోట్ల పోటీలో ఉంది.వైఎస్సార్‌సీపీ విషయానికి వస్తే.. విశాఖపట్నం జిల్లాలోని అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీలో ఉంది.


ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పలు నియోజకవర్గాల్లో అక్కడి రాజకీయ సమీకరణాలను బట్టి అభ్యర్థుల్ని మార్పులు, చేర్పులు చేసింది. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పోటీలో ఉన్నారు. పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పోటీ చేస్తున్నారు. మాడుగుల నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధ పోటీలో ఉన్నారు. అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ బదులు కొత్త అభ్యర్థి మలసాల భరత్ బరిలో ఉన్నారు. గాజువాక నుంచి మంత్రి గుడివాడ అమర్ పోటీలో నిలిచారు. పాడేరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టగుళ్ల భాగ్యలక్ష్మిని పక్కన పెట్టి ఎం.విశ్వేశ్వర రాజుకు అవకాశం ఇచ్చారు. అరకు లోయలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణను పక్కన పెట్టి రేగం మత్స్యలింగం పోటీ చేస్తున్నారు.


తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల విషయానికి వస్తే.. గంటా శ్రీనివాసరావు ఈసారి మళ్లీ నియోజకవర్గం మార్చి భీమిలి నుంచి పోటీలో ఉన్నారు. మాడుగుల నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పోటీ చేస్తున్నారు. మిగిలిన స్థానాల్లో మాజీ ఎమ్మెల్యే, పాత ఇంఛార్జ్‌లకే చంద్రబాబు టికెట్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు మే 13 (సోమవారం)న పోలింగ్ జరగనున్న సంగతి తెలసిందే.. అలాగే జూన్ 4న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.


 


 


ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 2024 ఎన్నికల్లో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు:


నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి టీడీపీ కూటమి అభ్యర్థి


విశాఖపట్నం తూర్పు ఎంవీవీ సత్యనారాయణ వెలగపూడి రామకృష్ణబాబు


విశాఖపట్నం పశ్చిమం అడారి ఆనంద్‌ కుమార్‌ పీజీవీఆర్‌ నాయుడు (గణబాబు)


విశాఖపట్నం ఉత్తరం కేకే రాజు విష్ణుకుమార్ రాజు (బీజేపీ)


విశాఖపట్నం దక్షిణం వాసుపల్లి గణేష్ కుమార్ వంశీకృష్ణ యాదవ్‌ (జనసేన పార్టీ)


భీమిలి అవంతి శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు


చోడవరం కరణం ధర్మశ్రీ కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు


పాయకరావుపేట కంబాల జోగులు వంగలపూడి అనిత


యలమంచిలి రమణమూర్తి రాజు సుందరపు విజయ్ కుమార్ (జనసేన పార్టీ)


మాడుగుల ఈర్ల అనురాధ బండారు సత్యనారాయణమూర్తి


అనకాపల్లి మలసాల భరత్‌ కొణతాల రామకృష్ణ (జనసేన పార్టీ)


గాజువాక గుడివాడ అమర్‌‌నాథ్ పల్లా శ్రీనివాసరావు


పెందుర్తి అన్నంరెడ్డి అదీప్‌ రాజు పంచకర్ల రమేష్ బాబు ( జనసేన పార్టీ)


పాడేరు ఎం. విశ్వేశ్వర రాజు గిడ్డి ఈశ్వరి


అరకు లోయ రేగం మత్స్యలింగం పాంగి రాజారావు (బీజేపీ)


నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్ చింతకాలయ అయ్యన్నపాత్రుడు







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com