ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఖరి నిమిషంలో తమ్ముడికి ట్విస్ట్ ఇచ్చిన అన్నయ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 07:34 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో నిలిచిన పిఠాపురానికి టాలీవుడ్ ప్రముఖులు క్యూ కడుతున్నారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్విహిస్తున్నారు. పలువురు మెగాహీరోలు సైతం ఇప్పటికే ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే తమ్ముడికి అండగా మెగాస్టార్ చిరంజీవి సైతం పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తారనే వార్తలు వచ్చాయి. మే 10, 11వ తేదీలలో ఏదో ఒకరోజు పిఠాపురంలో చిరంజీవి ఎన్నికల ప్రచారం చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. ఇప్పటి వరకూ మెగాస్టార్ దీనిని ఖండించకపోవటంతో ఆయన పిఠాపురం వెళ్లటం పక్కా అని అందరూ భావించారు. అయితే ఊహించని ట్విస్ట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.


విలేకర్లతో మాట్లాడుతూ పిఠాపురం వెళ్లటంపై చిరంజీవి స్పందించారు. పవన్ కళ్యాణ్ తరుపున ప్రచారం చేసేందుకు శనివారం తాను పిఠాపురం వెళ్తున్నానన్న వార్తలను చిరు తోసిపుచ్చారు. తాను పిఠాపురం వెళ్లడం లేదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ పిఠాపురం వెళ్తానని చెప్పలేదని అదంతా మీడియా ప్రచారంగా కొట్టిపారేశారు. అలాగే ఎన్నికల ప్రచారానికి నేను రావాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కోరుకోలేదన్నారు. పవన్ కళ్యాణ్ తమ కంఫర్ట్ కోరుకున్నారని చెప్పారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని చిరంజీవి స్పష్టం చేశారు. మరోవైపు తన తమ్ముడికి అండగా ఉన్నానని చెప్పేందుకే ఇటీవల వీడియో విడుదల చేశానని మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు.


  కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి కూటమి తరుఫున పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్నారు. అటు వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. ఏపీ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గంగా ఉన్న పిఠాపురంలో గెలుపును అటు కూటమి, ఇటు వైసీపీ చాలా కీలకంగా తీసుకున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ తరుఫున హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌‌తో పాటుగా జబర్దస్త్ కమెడియన్లు, పలువురు సీరియల్ నటులు కూడా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి కూడా ప్రచారానికి వస్తారనే ప్రచారం జరిగింది. దీనికి తగినట్లుగానే పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలంటూ ఇటీవల వీడియోను సైతం చిరంజీవి విడుదల చేశారు. దీంతో చిరు ప్రచారానికి వస్తారనే వార్తలు రాగా.. రావడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com